ముంబై: ప్రముఖ రుణ సేవల ప్లాట్ఫాం ‘చెక్’, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దేశంలోనే తొలి కో–బ్రాండెడ్ ఎల్ఈడీ క్రెడిట్ కార్డును ఆవిష్కరించాయి. సులభతర చెల్లింపులు, గరిష్ట రివార్డు పాయింట్లే లక్ష్యంగా క్రెడిట్ కార్డు వినియోగదారులకు వినూత్న అనుభవాన్ని అందించేందు కు చెక్ ఏయూ క్రెడిట్ కార్డు పేరుతో దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు ప్రకటించాయి.
ఎల్ఈ డీ ఆధారిత చెల్లింపుల ట్యాపింగ్ విధానం ఈ క్రెడిట్ కార్డు ప్రత్యేకత అని చెక్ వ్యవస్థాపకుడు, సీఈవో ఆదిత్య సోని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పీఓఎస్ యంత్రాల ద్వారా జరిపే ప్రతి చెల్లింపు సందర్భంగా క్రెడిట్ కార్డులోని ఎల్ఈడీ లైటు వెలుగుతుందని.. తద్వారా చెల్లింపు ధ్రువీకరణ తక్షణమే కనిపిస్తుందని వివరించారు.
ఇందుకు బ్యాటరీ అవసరం లేదని.. పీఓసీలోని ఎన్ఎఫ్సీ ఫీల్డ్ సాయంతో ఎల్ఈడీ కాంతి ప్రసరిస్తుందన్నారు. ఈ సరికొత్త క్రెడిట్ కార్డు కావాలనుకొనే వారు చెక్ యాప్ లో ఈ నెల 28 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.


