డిజిటల్‌ యాడ్స్‌ డబుల్‌ | Indian digital ad market likely to double to 22 billion dollers by 2030 | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ యాడ్స్‌ డబుల్‌

Apr 18 2026 6:09 AM | Updated on Apr 18 2026 6:56 AM

Indian digital ad market likely to double to 22 billion dollers by 2030

భారత్‌లో డిజిటల్‌ అడ్వర్టైజ్‌మెంట్‌ మార్కెట్‌ జోరు

2030 నాటికి 22 బిలియన్‌ డాలర్లకు 

అంతర్జాతీయంగా 1.2 ట్రిలియన్‌ డాలర్లకు.. 

మార్కెట్‌ రీసెర్చ్‌ కంపెనీ రెడ్‌సీర్‌ నివేదిక 

న్యూఢిల్లీ: దేశీయంగా డిజిటల్‌ అడ్వర్టైజ్‌మెంట్‌ మార్కెట్‌ వచ్చే ఐదేళ్లలో దాదాపు రెట్టింపు కానుంది. 2030 నాటికి 19–22 బిలియన్‌ డాలర్లకు చేరనుంది. 2025లో ఇది 11 బిలియన్‌ డాలర్లుగా ఉండగా రాబోయే రోజుల్లో ఏటా 10–15 శాతం మేర వృద్ధి చెందనుంది. మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ రెడ్‌సీర్‌ కన్సల్టింగ్‌ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అంతర్జాతీయంగా కూడా డిజిటల్‌ అడ్వర్టైజింగ్‌ మార్కెట్‌ భారీగా విస్తరిస్తోంది. గతేడాది ప్రకటనలపై చేసిన మొత్తం వ్యయాల్లో 70–75 శాతం వాటాను ఆక్రమించింది.  

నివేదికలో ఇతర ముఖ్యాంశాలు.. 
→ భౌగోళికంగా చూస్తే గ్లోబల్‌ డిజిటల్‌ యాడ్‌లపై చేసే వ్యయాల్లో 46 శాతం మార్కెట్‌ వాటాతో అమెరికా అగ్రస్థానంలో, 24% వాటాతో చైనా రెండో స్థానంలో ఉన్నాయి. భారత్‌ వాటా ప్రస్తుతం 1 శాతంగా ఉంది. 

→ 2030 నాటికి అంతర్జాతీయంగా డిజిటల్‌ అడ్వర్టైజింగ్‌ మార్కెట్‌ 1.2 ట్రిలియన్‌ డాలర్లకు చేరనుంది.  

→ డిజిటల్‌ ప్రకటనల్లో మొబైల్‌ యాడ్స్‌ వాటా అత్యధికంగా 65–70 శాతంగా ఉంటోంది. అమెరికాలో ఇన్‌–యాప్‌ అడ్వర్టైజింగ్‌ వాటా 80–85 శాతంగా ఉంది. 

→ అల్గోరిథమ్‌ ఆధారిత డిజిటల్‌ అడ్వర్టైజింగ్‌ వ్యయాల్లో 70–80 శాతం వాటాతో కొన్ని సంస్థల ఆధిపత్యమే ఉంటోంది. తమకంటూ సొంత వ్యవస్థలు ఉన్న అల్ఫాబెట్, మెటా, అమెజాన్, యాపిల్, బైట్‌డ్యాన్స్‌ తదితర దిగ్గజాలు వీటిలో ఉన్నాయి.  

→ ఇక ఓపెన్‌ వ్యవస్థలోని సంస్థల వాటా మిగతా 20–30 శాతంగా ఉంది. ఇన్‌మొబి, యూనిటీ యాడ్స్, ఓపెన్‌ఎక్స్‌ మొదలైన బ్రాండ్లు వీటిలో ఉన్నాయి.  

→ వేగంగా అందిపుచ్చుకునే వారు, వెనుకబడిన వారి మధ్య అంతరం పెరిగిపోతున్న నేపథ్యంలో... తదుపరి దశ అడ్వర్టైజింగ్‌ అంతా ప్రైవసీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారితమైనదిగా ఉండనుంది. భవిష్యత్తులో ఏఐని విస్తృతంగా వినియోగించుకునే సంస్థలు విజేతలుగా నిలుస్తాయి. 

Advertisement
 
Advertisement
Advertisement