భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేసే దిశగా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కీలక అడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా అండర్గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ (యూసీజీ) సాంకేతికతకు వీలు కల్పించేలా రూపొందించిన వాణిజ్య బొగ్గు గనులను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకున్నాయి. ఈ మేరకు నాలుగు బొగ్గు గనులకు సంబంధించిన ‘కోల్ మైన్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ అగ్రిమెంట్స్’ (సీఎంపీడీఏ)పై సంస్థలు సంతకాలు చేశాయి.
ఎవరికి ఏ గనులు?
రిలయన్స్ ఇండస్ట్రీస్: ఆంధ్రప్రదేశ్లోని రెచెర్ల, చింతలపూడి సెక్టార్ ఏ1 బొగ్గు గనులను సొంతం చేసుకుంది.
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్: ఒడిశాలోని బెల్పహార్, తంగార్దిహి ఈస్ట్ బొగ్గు గనులను దక్కించుకుంది.
ఈ నాలుగు గనుల్లో రెండు పాక్షికంగా నిర్వహిస్తున్నావి కాగా, మరో రెండు పూర్తిగా కార్యకలాపాలు సాగిస్తున్నవి.
ఏమిటీ యూసీజీ ప్రత్యేకత?
సాధారణంగా బొగ్గును గనుల నుంచి వెలికితీసి ఆపై విద్యుత్ లేదా ఇంధనం కోసం ఉపయోగిస్తారు. అయితే, యూసీజీ సాంకేతికత అందుకు భిన్నం. ఇది బొగ్గును నేరుగా సీమ్ (నేల లోపల బొగ్గు పొర)లోనే సింథటిక్ వాయువు (సిన్గ్యాస్)గా మారుస్తుంది. దీనివల్ల సంప్రదాయ మైనింగ్ అవసరం ఉండదు. సాధారణ పద్ధతుల్లో దీన్ని వెలికితీయడం కష్టసాధ్యం. ఈ పద్ధతి ద్వారా లోతైన బొగ్గు పొరల నుంచి కూడా సింథటిక్ వాయువును తయారు చేయవచ్చు.
బొగ్గు మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం, ఈ గనులలో సాంప్రదాయ మైనింగ్తో పాటు యూసీజీ పద్ధతిని కూడా అనుసరించే వెసులుబాటును ఆపరేటర్లకు కల్పించారు. ఇది దేశంలోని ఇంధన వనరులను గణనీయంగా పెంచుతుంది. ఈ ప్రాజెక్టులు కేవలం ఇంధన ఉత్పత్తికే పరిమితం కాకుండా దేశీయ పారిశ్రామిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా వెలువడే సిన్గ్యాస్ యూరియా, అమ్మోనియా తయారీకి కీలకంగా మారుతుంది. ఇది ఎరువుల దిగుమతులపై భారత్కున్న ఆధారపడటాన్ని తగ్గించి ఆహార భద్రతకు ఊతమిస్తుంది.
కెమికల్స్, పెట్రోకెమికల్స్ తయారీలో సహజ వాయువు, నాఫ్తా స్థానంలో ఈ సిన్గ్యాస్ను ఉపయోగించి మిథనాల్, డైమిథైల్ ఈథర్ (డీఎంఈ), ఇతర సింథటిక్ ఇంధనాలను స్వదేశంలోనే తయారు చేసే అవకాశం లభిస్తుంది. ఈ నాలుగు ఒప్పందాలతో కలిపి ఇప్పటివరకు వాణిజ్య బొగ్గు వేలం ద్వారా జరిగిన మొత్తం ఒప్పందాల సంఖ్య 138కి చేరుకుంది.
తాజా ఒప్పందంలోని ముఖ్యాంశాలు
గరిష్ట సామర్థ్యం: 331.544 ఎంటీపీఏ.
ఆర్థికాభివృద్ధి: ఏడాదికి సుమారు రూ.42,980 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం.
పెట్టుబడులు: రూ.48,231 కోట్ల మేర మూలధన పెట్టుబడులు.
ఉపాధి: సుమారు 4,34,175 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు.
ఇదీ చదవండి: నమ్మావో ముంచేస్తారు!


