Hyderabad Based EV Startup Gravton Enters Asia Book of Records - Sakshi
Sakshi News home page

ఈవీ బైక్‌.. ఛార్జింగ్‌ కోసం ఎక్కడా ఆగక్కర్లేదు.. హైదరాబాద్‌ స్టార్టప్‌ ఆవిష్కరణ

Published Fri, Feb 4 2022 4:44 PM

Hyderabad based EV Startup Gravton Entered Asia Book Of Records And KTR Applauds - Sakshi

ఎలక్ట్రిక్‌ వెహికల్‌ సెక్టార్‌లో సత్తా చూపేందుకు హైదరాబాద్‌ రెడీ అవుతోంది. ఇప్పటి వరకు ఈవీ సెక్టార్‌లో చెన్నై, బెంగళూరుల హవా కొనసాగుతుండగా ఇప్పుడు వాటికి ధీటుగా హైదరాబాద్‌ బదులిస్తోంది. నగరానికి చెందిన ఓ ఈవీ స్టార్టప్‌ బైక్‌ సాధించిన ఫీట్‌ ఏషియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో చోటు సాధించింది. 

వచ్చేసింది క్వాంటా
ఎలక్ట్రిక్‌ బైక్‌ స్టార్టప్‌గా గ్రావ్‌టన్‌ 2016లో హైదరాబాద్‌లో మొదలైంది. నాలుగేళ్ల శ్రమ అనంతరం క్వాంటా పేరుతో ఈవీ బైక్‌ని రెడీ చేసింది. ఇప్పటి వరకు దేశంలో ఉన్న ఈవీ బైకులన్నీ ఛార్జింగ్‌ కోసం గంటల తరబడి ఛార్జింగ్‌ పోర్టు దగ్గర ఆగే విధంగానే రూపొందాయి. కానీ గ్రావ్‌టన్‌ క్వాంటాకి ఈ సమస్య లేదు.

స్వాపబుల్‌ బ్యాటరీ
క్వాంటా  బైకుని స్వాపబుల్‌ బ్యాటరీ టెక్నాలజీతో గ్రావ్‌టన్‌ రూపొందించింది. అంటే బ్యాటరీలో ఛార్జింగ్‌ అయిపోతే మరో బ్యాటరినీ అమర్చుకునే వీలు ఈ బైకుకి ఉంది. అయితే ఈ టెక్నాలజీ ఎంత వరకు పని చేస్తుందో.. ఫీల్డ్‌లో వచ్చే ఇబ్బందులు ఏంటో తెలుసుకునేందుకు ఓ అరుదైన ఫీట్‌ చేయడానికి గ్రావ్‌టన్‌ సిద్ధపడింది. అందులో భాగంగా కన్యాకుమారి నుంచి లడఖ్‌లోని కార్‌దుంగ్లా వరకు బైక్‌ ట్రిప్‌ని ప్లాన్‌ చేసింది.

కేటూకే ఫీట్‌
20211 సెప్టెంబరు 13న కన్యాకుమారిలో ప్రయాణం మొదలు పెట్టి సెప్టెంబరు 20న కార్‌దుంగ్లాకి చేరుకుంది. ఈ ప్రయాణానికి మొత్తం ఆరున్నర రోజుల సమయం పట్టగా వాతావరణానికి అలవాటు పడేందుకు మనాలీలో ఒక రోజు వేచి ఉన్నారు. కన్యాకుమారి నుంచి మనాలీ వరకు 3400 కిలోమీటర్లు ఛార్జింగ్‌ కోసం ఎక్కడా ఆగకుండా ఏకబిగిన క్వాంటా ప్రయాణించింది. మార్గమధ్యంలో రెస్ట్‌ తీసుకునే సమయంలోనే బ్యాటరీల ఛార్జింగ్‌ పని జరిగింది. ఈ ప్రయాణంలో అన్ని రకాల రోడ్లపై ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెట్రోలు బైకుల తరహాలోనే క్వాంటా రైడ్‌ ఎక్స్‌పీరియన్ష్‌ ఉందని గ్రావ్‌టన్‌ తెలిపింది.

ఏషియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌
కేవలం ఆరున్న రోజుల్లో మొత్తం 4011 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన ఈవీ బైకుగా ఏషియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో గ్రావ్‌టన్‌ క్వాంటా చోటు సాధించింది. దీంతో రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ క్వాంటా టీమ్‌కి అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. 

ఫీచర్లు
మార్కెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం క్వాంటా బైకు ధర రూ.99000 (ఎక్స్‌షోరూం) లుగా ఉంది. లిథియం ఐయాన్‌ బ్యాటరీ ఉపయోగించారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 320 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఛార్జింగ్‌కి మూడు గంటల సమయం తీసుకుంటుంది. ఆటోమేటిక్‌ గేర్‌ సిస్టమ్‌, డిస్క్‌ బ్రేకులు అమర్చారు. స్వాపింగ్‌ బ్యాటరీ ఫుల్‌ ఛార్జ్‌కి 2 నుంచి 3 గంటల వరకు సమయం పడుతుంది.
 

చదవండి: కియా ఇండియా సంచలనం..! విదేశాలకు లక్షకుపైగా..అది కూడా ఏపీ నుంచే..!

Advertisement
Advertisement