
ఐవోసీ, గెయిల్, రైట్స్తో హిందుస్తాన్ కాపర్ జత
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజాలు కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ మూలకాల కోసం చేతులు కలపనున్నాయి. తద్వారా మినీరత్న సీపీఎస్ఈ హిందుస్తాన్ కాపర్.. కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ మూలకాల బ్లాకులకు బిడ్ చేయనుంది. ఇందుకు ఇతర పీఎస్యూ దిగ్గజాలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ), గెయిల్ (ఇండియా), రైల్వే రంగ సంస్థ రైట్స్తో జత కట్టనున్నట్లు హిందుస్తాన్ కాపర్ చైర్మన్, ఎండీ సంజీవ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా ఐవోసీ, గెయిల్తో హిందుస్తాన్ కాపర్ తప్పనిసరికాని ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు తెలియజేశారు. కాపర్ బ్లాకులతోపాటు కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ మూలకాల బ్లాకులను ప్రభుత్వం వేలం వేయనున్నట్లు వెల్లడించారు. వీటన్నిటికీ కంపెనీ బిడ్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ బాటలో చిలీలో కాపర్సహా ఇతర కీలక ఖనిజాల అన్వేషణ కోసం మరో ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకునే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ బాటలో ఇప్పటికే ఈ నెల మొదట్లో రైల్వే రంగ ఇంజినీరింగ్ పీఎస్యూ రైట్స్తో ఒప్పందానికి తెరతీసిన విషయాన్ని ప్రస్తావించారు. తద్వారా దేశ, విదేశీ మార్కెట్ల కోసం సంయుక్తంగా కీలక ఖనిజాల సరఫరా చైన్ను అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా దేశ, విదేశాలలో కీలక ఖనిజాల అన్వేషణ, వెలికితీత, శుద్ధి, ఉత్పత్తి కార్యకలాపాలను చేపట్టనున్నట్లు వివరించారు. మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సైతం అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. కంపెనీ దేశీయంగా రాగి గనుల మైనింగ్లో కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.