ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త సమస్య | Global Economy Hormuz Tensions Trigger Fertilizer Sulfur Oil Shock | Sakshi
Sakshi News home page

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త సమస్య

May 14 2026 11:45 AM | Updated on May 14 2026 11:57 AM

Global Economy Hormuz Tensions Trigger Fertilizer Sulfur Oil Shock

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు కేవలం ముడి చమురు ధరలే కాదు అంతకుమించిన పెను సంక్షోభం ముంచుకొస్తోంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని హార్మూజ్‌ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇంధన రంగంతోపాటు ప్రపంచ ఆహార భద్రతను, పారిశ్రామిక ఉత్పత్తిని అతలాకుతలం చేస్తున్నాయి. ఎరువులు, సల్ఫర్, పారిశ్రామిక లోహాల సరఫరా గొలుసు విచ్ఛిన్నం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలే ప్రమాదం కనిపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1,150 శాతం పెరిగిన ధరలు

ప్రపంచ పారిశ్రామిక రంగానికి లైఫ్ లైన్ వంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆర్గస్ ప్రైసింగ్, యూఎస్ జియోలాజికల్ సర్వే గణాంకాల ప్రకారం.. గత రెండేళ్లతో పోలిస్తే చైనా సల్ఫ్యూరిక్ యాసిడ్ ధరలు ఏకంగా 1,150 శాతం పెరిగాయి. మిడిల్‌ ఈస్ట్‌ ప్రాంతంలో సల్ఫర్ ధరల్లో 750 శాతం పెరుగుదల నమోదైంది. ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారు అయిన చిలీలో ధరలు 230 శాతం పెరిగాయి.

సల్ఫ్యూరిక్ యాసిడ్ లేకుండా ఎరువుల ఉత్పత్తి, రాగి ప్రాసెసింగ్, బ్యాటరీల తయారీ, సెమీకండక్టర్ల ఫ్యాబ్రికేషన్ అసాధ్యం. ప్రపంచ సల్ఫర్ ఎగుమతుల్లో సగానికి పైగా పర్షియన్ గల్ఫ్ నుంచే వస్తుండటంతో హార్మూజ్‌ జలసంధి మూసివేత ఈ సరఫరాను పూర్తిగా స్తంభింపజేసింది.

చమురు సంక్షోభం

సౌదీ ఆరామ్‌కో సీఈఓ అమిన్ నాసర్ ఈ పరిస్థితిని ‘ప్రపంచం ఇప్పటివరకు చూడని అతిపెద్ద ఇంధన సరఫరా షాక్’గా అభివర్ణించారు. గతంలో రోజుకు 70 నౌకలు ప్రయాణించే హార్మూజ్‌ జలసంధి ద్వారా ఇప్పుడు కేవలం 2 నుంచి 5 నౌకలు మాత్రమే వెళ్తున్నాయి. సుమారు 240 నౌకలు సముద్రం మధ్యలోనే నిలిచిపోయాయి.

ప్రతి వారం ప్రపంచ మార్కెట్లు 100 మిలియన్ బ్యారెళ్ల చమురును కోల్పోతున్నాయి. ఇప్పటివరకు సుమారు 1 బిలియన్ బ్యారెళ్ల సరఫరాకు అంతరాయం కలిగింది. అమెరికా వ్యూహాత్మక చమురు నిల్వలు 1982 తర్వాత అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయే ప్రమాదం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ హెచ్చరించింది.

ఎరువుల కొరతతో ఆహార సంక్షోభం

చమురు కంటే ఎరువుల సంక్షోభమే అత్యంత భయంకరంగా ఉండబోతోందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఎరువుల వాణిజ్యంలో మూడింట ఒక వంతు హార్మూజ్‌ జలసంధి గుండానే జరుగుతుంది. ఖతార్ ఫెర్టిలైజర్ కంపెనీ ఇప్పటికే ‘ఫోర్స్ మేజర్’(నియంత్రణలో లేని అసాధారణ పరిస్థితుల వల్ల పనిని పూర్తి చేయలేకపోవడం) ప్రకటించగా, నెలకు 3-4 మిలియన్ టన్నుల ఎరువుల సరఫరా నిలిచిపోయింది.

భారత్ ఇప్పటికే మూడు యూరియా ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గించగా బంగ్లాదేశ్ ఐదు ప్లాంట్లలో నాలుగింటిని మూసివేసింది. బ్రెజిల్‌లో యూరియా దిగుమతులు 33 శాతం పడిపోయాయి. ఈ సరఫరా అంతరాయం కొనసాగితే వచ్చే కొద్ది నెలల్లోనే 4.5 కోట్ల మంది తీవ్ర ఆకలి బారిన పడే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం ఆందోళన వ్యక్తం చేసింది.

పారిశ్రామిక రంగంపై ప్రభావం

కేవలం వ్యవసాయమే కాదు, హైటెక్ పరిశ్రమలు కూడా చిక్కుల్లో పడ్డాయి. సెమీకండక్టర్లకు అవసరమైన హీలియం సరఫరా నిలిచిపోయింది. సల్ఫర్ కొరత కారణంగా ఇండోనేషియాలో నికెల్ ప్రాసెసింగ్ నిలిచిపోయింది. ఇది నేరుగా ఈవీ బ్యాటరీల తయారీపై దెబ్బకొడుతోంది.

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు

ఒకవైపు ఆర్థిక సంక్షోభం వెంటాడుతుంటే, మరోవైపు అగ్రరాజ్యాల మధ్య దౌత్యపరమైన వేడి పెరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రతిపాదనలను తోసిపుచ్చడం, అమెరికా అణు జలాంతర్గామి జిబ్రాల్టర్ చేరుకోవడం వంటి పరిణామాలు యుద్ధ మేఘాలను సూచిస్తున్నాయి. మే 14-15 తేదీల్లో ట్రంప్ బీజింగ్ పర్యటనపైనే ఇప్పుడు ప్రపంచం ఆశలు పెట్టుకుంది.

మార్కెట్లు కేవలం చమురు ధరల పెరుగుదలను మాత్రమే అంచనా వేస్తున్నాయి. కానీ తెరవెనుక ఎరువులు, సల్ఫర్ కొరత సృష్టిస్తున్న విధ్వంసం ఇంకా అంచనాలకు అందడం లేదు. ఒకవేళ జూన్ మధ్య నాటికి హార్మూజ్‌ జలసంధిలో పరిస్థితులు చక్కబడకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2027 వరకు కోలుకోవడం కష్టమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్‌పై జోహో ప్రకటన

Advertisement
 
Advertisement
Advertisement