పెనుబల్లి/బూర్గంపాడు: ఉమ్మడి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు మంగళవారం వడదెబ్బతో మృతి చెందారు. సత్తుపల్లి మండలం యా తాలకుంటకు చెందిన నేరెళ్ల వెంకటేశ్వరరావు (55) పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజరలోని తన చెల్లిలి ఇంటికి వచ్చి అక్కడి నుంచి చౌడవరంలోని కూతురి ఇంటికి వెళ్లాడు. అక్కడకు వెళ్లగానే వాంతులు చేసుకుంటూ అపస్మారక స్థితికి చేరగా కుటుంబ సభ్యులు పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే సరికే వెంకటేశ్వరరావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎండలో తిరగడం వల్ల వడదెబ్బతో మృతి చెందినట్లు భావిస్తున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అలాగే, బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెంకు చెందిన కొప్పుల శ్రీను (50) వడదెబ్బ తో మృతి చెందాడు. కొంతకాలంగా కుటుంబంతో విభేదించి భిక్షాటన చేసి జీవిస్తున్న ఆయన మంగళవారం గ్రామంలోని కొర్రాజుల గుడి వద్ద నిద్రించాడు. రెండు రోజులుగా ఎండల తీవ్రతతో వడదెబ్బకు గురైన ఆయన నిద్రలోనే ప్రాణాలు వదిలాడు.


