● అరుదైన వ్యాధితో బాధపడుతున్న నెల చిన్నారి ● దాతల సాయం కోసం తల్లిదండ్రుల వినతి
అశ్వారావుపేటరూరల్: అరుదైన వ్యాధితో ఓ పసిబిడ్డ నిత్యం మృత్యువుతో పోరాడుతోంది. ఆ వ్యాధి నుంచి పసిప్రాణాన్ని కాపాడుకునేందుకు నిరుపేద కుటుంబం పెద్దస్థాయిలో ఖర్చు పెట్టలేక మనోవేదనకు గురవుతున్నారు. వైద్యానికి రోజుకు లక్షల్లో ఖర్చు అవుతున్న నేపథ్యంలో ఆర్థిక స్థోమత లేక దాతల సాయం కోసం చూస్తున్నారు. అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన హేమలత – వినోద్ దంపతులకు నెలరోజుల క్రితం కుమార్తె జన్మించింది. కాగా, పుట్టిన నవజాత శిశువు అనారోగ్యానికి గురి కావడంతో హైదారాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. వైద్యులు పరీక్షించి చిన్నారికి మొదడువాపుతోపాటు రక్తంలో ఇన్ఫెక్షన్, గుండె సమస్యతో ఉన్నట్లు గుర్తించారు. ఖరీదైన వైద్యం అందించడంతో ఇప్పటిదాకా రూ.6లక్షలు ఖర్చు కావడంతో పాటు రోజుకు లక్షల్లో ఖర్చు అవుతున్నట్లు పసిబిడ్డ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దమ్మపేట మండలం దురదపాడు గ్రామానికి చెందిన వినోద్ మిషన్ భగీరథలో కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పేద కుటుంబం కావడంతో ఖరీదైన వైద్యాన్ని భరించలేక, పసిబిడ్డ ప్రాణాలను కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు. దాతల సాయం కోసం తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. వైద్యంకోసం ఇప్పటికే రూ.ఆరు లక్షలు ఖర్చు చేశామని, రోజుకు రూ.లక్ష దాకా ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతున్నారని కన్నీరుమున్నీరవుతున్నారు. పసి ప్రాణాలను కాపాడుకునేందుకు సా యం చేసే చేతులు, మానవతా వాదుల కోసం ఎదురుచూస్తున్నారు. పసిబిడ్డ వైద్యానికి సాయం అందించే దాతలు 80963 19456 (ఫోన్ పే) నంబర్లో సంప్రదించవచ్చు.


