నాణ్యమైన సేవలతో వ్యాపారాభివృద్ధి
భద్రాచలంటౌన్: వినియోగదారులకు నాణ్య మైన సేవలు అందించడం ద్వారా వ్యాపారాభివృద్ధి సాధ్యమవుతుందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య తెలిపారు. భద్రాచలం బ్రిడ్జి సెంటర్ వద్ద ఎస్ఎల్బీటీ పెయింట్స్ అండ్ జనరల్ సంస్థ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ‘నెక్సన్’ షోరూంను సోమవారం వారు ప్రారంభించి మాట్లాడారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న భద్రాచలంలో ‘నెక్సన్’ షోరూం ప్రారంభం కావడం హర్షణీయమని తెలిపారు. అనంతరం వెంకట్రావ్, వీరయ్యను ఎస్ఎల్బీటీ సంస్థ అధినేతలు సెట్టి వేణు, భూమా తేజ సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.
ఆయిల్పామ్తో
అధిక లాభాలు
సూపర్బజార్(కొత్తగూడెం): ఆయిల్పామ్ సాగు చేస్తే రైతులు అధిక లాభాలు గడించవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖాధికారి జంగా కిషోర్ అన్నారు. అధికారులు, పీఏసీఎస్ సీఈఓలతో సోమవారం తమ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయిల్పామ్ సాగు ఆవశ్యకత, సబ్సిడీ వంటి వివరాలు తెలిపారు. సమావేశంలో పీసీఓ ఎ.శ్రీనివాస్, ఆయిల్ఫెడ్ డీఓ రాధాకృష్ణ, గోద్రేజ్ డీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అసాంఘిక శక్తులపై
కఠిన చర్యలు
ఇల్లెందు: అసాంఘిక శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ చంద్రభాను హెచ్చరించారు. ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాలతో ఇల్లెందు పోలీసులు సోమవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆర్అండ్ఆర్ కాలనీలో 100 గృహాల్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా పత్రాలు లేని 60 బైక్లు, 10 ఆటోలు, మద్యం, గుట్కాలు పట్టుకున్నారు. ఐదు బైక్లు సీజ్ చేశారు. అనంతరం చంద్రబాను మాట్లాడుతూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వ్యక్తుల సమాచారం పోలీసులకు అందించాలని కోరారు. తమ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తేవాలన్నారు. సైబర్ నేరాల నియంత్రణ కోసం తమ నివాస ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ టి.సురేష్, టేకులపల్లి, గుండాల సీఐలు బత్తుల సత్యనారాయణ, లోడిగ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈపీఎఫ్ సమస్యలు పరిష్కరించుకోండి
పాల్వంచ: ఈపీఎఫ్లో తప్పులుంటే వాటిని సవరణ చేసుకోవచ్చని నిధి ఆప్కే నికట్ వరంగల్ అకౌంట్స్ అధికారి కొండపల్లి సునీల్ అన్నా రు. స్థానిక మున్సిపల్ డివిజన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతీ నెల 27వ తేదీన ఈపీఎఫ్పై అవగాహన కార్యక్రమం ఉంటుందని, ఈ సందర్బంగా నిర్వహించే గ్రీవెన్స్లో సమస్యలు పరిష్కరించి సలహాలు, సూచనలు చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గత ఆగస్టులో ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి వికసిత్ భారత్ ఉద్యోగ యోజన పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడం, ఉపాధి సామర్థ్యాన్ని అభివృద్ది చేయడం, అన్ని రంగాల్లో సామాజిక భద్రత మెరుగుపర్చడం వంటి ప్రయోజనాలు పొందాలని అన్నారు. కార్యక్రమంలో కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ కె.సుజాత, సెక్షన్ సూపర్వైజర్ రమేష్, మున్సిపల్ మేనేజర్ లోగాని వెంకట సత్యనారాయణ, బరగడి దేవదానం, వెంపటి అరుణ్ కుమార్, బి.సక్రాం, ఎం.సత్యనారాయణ పాల్గొన్నారు.
108 అంబులెన్స్ తనిఖీ
గుండాల: ఆళ్లపల్లి మండల కేంద్రంలో పనిచేస్తున్న 108 అంబులెన్స్ను హైదరాబాద్ క్వాలిటీ విభాగం అధికారి ఫకీర్దాస్, జిల్లా సమన్వయకర్త సతీష్ సోమవారం తనిఖీ చేశారు. వాహనంలోని పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. వాహనం మరమ్మతులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించే క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 108 సిబ్బంది పరమ సునీల్ కుమార్, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన సేవలతో వ్యాపారాభివృద్ధి
నాణ్యమైన సేవలతో వ్యాపారాభివృద్ధి


