నిబంధనల ప్రకారమే కొనుగోళ్లు
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలో ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ హాజరై మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కనీస వసతులు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. జిల్లాలో 193 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఆరు పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. రాబోయే రెండు రోజులపాటు వర్షాలు కొనసాగనున్న నేపథ్యంలో వరి కోతలు తాత్కాలికంగా నిలిపివేయాలని విస్తృత ప్రచారం చేపడతామని తెలిపారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ప్రతి రోజు ధాన్యం సేకరణ వివరాలు, గన్నీ బ్యాగుల వివరాల నివేదిక అందజేయాలని ఆదేశించారు. జిల్లాలోని రైతులను కపాస్ కిసాన్ యాప్లో రిజిస్టర్ అయ్యేలా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచించారు.
కలెక్టర్ను కలిసిన సైన్స్ అధికారి..
జూలూరుపాడు: కలెక్టర్ జితేష్ వి పాటిల్ను జిల్లా సైన్స్ అధికారి బి. సంపత్కుమార్ సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. జిల్లాలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వినూత్న పద్ధతిలో టెక్నాలజీని ఉపయోగించుకొని ఆవిష్కరణలు చేపట్టాలని ఈ సందర్భంగా సంపత్ కుమార్కు కలెక్టర్ సూచించారు.
అప్డేట్ బాధ్యత కాంప్లెక్స్ హెచ్ఎంలదే..
కొత్తగూడెంఅర్బన్: యూడైస్ వాస్తవ పరిస్థితికి అనుగుణంగా అప్డేట్ చేయించాల్సిన బాధ్యత కాంప్లెక్స్ హెచ్ఎంలదేనని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. పాత్తకొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణా కేంద్రంలో సోమవారం జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యూడైస్ రిపోర్టును సక్రమంగా ఎంటర్ చేయకపోవడంతో జిల్లా పీజీఐ ర్యాంక్ తగ్గిపోతుందని అన్నారు. అనంతరం డీఈఓ బి.నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో స్వచ్ఛ, హరిత పాఠశాలల ఎంపికలో భాగంగా 4, 5 స్టార్స్ కల్గిన 486 పాఠశాలలను గుర్తించి, 90 మంది కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అసైన్ చేశామని, ఈనెల 31వరకు మూల్యాంకనం చేసి ఎస్హెచ్వీఆర్ వెబ్సైట్లో ఆయా అంశాలను అప్లోడ్ చేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, పౌరసరఫరాల అధికారి రుక్మిణి, మేనేజర్ త్రినాధ్ బాబు, మార్కెటింగ్ అధికారి నరేందర్, ఆర్టీఓ వెంకటరమణ, విద్యాశాఖ కోఆర్డినేటర్లు ఎస్.కె సైదులు, సతీష్ కుమార్, నాగ రాజశేఖర్ పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్


