
అధికారం కోసమే బీజేపీ దైవజపం
● మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలి ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నేలకొండపల్లి : అధికారం కోసమే బీజెపీ రామ జపం, దైవ జపం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మండలంలోని మోటాపురంలో ఆదివారం జరిగిన సీపీఐ మండల మహాసభలో ఆయన మాట్లాడారు. దేవుడి పేరుతో ప్రజలను వంచిస్తోందని, మతం మాటున ప్రజలను చీల్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీకి అధికార ధ్యాసే తప్ప దేశభక్తి లేదన్నారు. దేశం కోసం బీజెపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పేదల అభ్యున్నతి, హక్కుల కోసం పోరాడేది కమ్యూనిస్టులేనని, త్యాగాల చరిత్ర తమ సొంతమని అన్నారు. కార్పొరేట్ల కోసమే పనిచేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో సంపద సృష్టి కోసం కొత్త మార్గాలు అన్వేషించాలని ప్రభుత్వానికి సూచించారు. మావోయిస్టులను హతమార్చడానికి అమిత్షా వంటి వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మావోయిస్టులు జన జీవన స్రవంతిలోకి రావాలని కోరారు. సీపీఐ శత వసంతాల ముగింపు సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మంలో ఐదు లక్షల మందితో చారిత్రిక సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సభలో సీపీఐ రాష్ట్ర, జిల్లా నాయకులు హేమంతరావు, మహ్మద్ మౌలానా, దండి సురేష్, జితేందర్రెడ్డి, కర్ణకుమార్, కర్నాటి భానుప్రసాద్, రామ్మూర్తి, మారిశెట్టి వెంకటేశ్వరరావు, పాల్తీయ శ్రీనివాసరావు, రాంకోటి, కాశిబోయిన అయోధ్య, మేకల పుల్లయ్య, మల్లెబోయిన ఉపేందర్, సీతారాములు, ఆశోక్ తదితరులు పాల్గొన్నారు.