
అతివలకు అండగా ‘సఖి’
● రెండేళ్లలో 565 కేసులు.. 216 పరిష్కారం ● అత్యధికంగా గృహహింస కేసులే.. ● ఫిర్యాదుల స్వీకరణకు అందుబాటులో టోల్ ఫ్రీ నంబర్ 181
కొత్తగూడెంటౌన్: సమస్యల్లో ఉన్నామని మహిళలు ఫోన్ చేస్తే చాలు.. అండగా సఖి సెంటర్ నిర్వాహకులు ఉంటున్నారు. జిల్లావ్యాప్తంగా 2023 మే నుంచి 2025 మే వరకు 565 కేసుల్లో బాధితులు సఖీ సెంటర్కు ఫిర్యాదు చేశారు. వాటిలో 216 కేసులు రాజీ కాగా, మిగిలినవి విచారణ దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు. కొత్తగూడెంలో సఖి వన్స్టాప్ సెంటర్ను మొదటగా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో 2019లో ఏర్పాటు చేశారు. 2025లో ప్రస్తుతం కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాల వద్ద సఖి సెంటర్ను నిర్వహిస్తున్నారు. గృహ హింస, వరకట్న వేధింపులు, ఆస్తి తగాదాలు, వయోవృద్ధులు, ప్రేమించి మోసానికి గురైన బాధితులకు ఆశ్రయం కల్పిస్తూ, పొలీసుశాఖతో పాటు న్యాయ సేవలు, కౌన్సెలింగ్తో వారి సమస్యలు పరిష్కారిస్తున్నారు. తాత్కాలిక వసతితో పాటు అత్యవసర సరిస్థితుల్లో బాధిత మహిళలకు వాహన సదుపాయం కల్పిస్తున్నామని సఖి సెంటర్ అడ్మిన్ జులుమూరి సుభశ్రీ తెలిపారు.
రెండేళ్లలో నమోదైన కేసులు
జిల్లావ్యాప్తంగా రెండేళ్లలో 565 కేసులు నమోదు కాగా అత్యధికంగా గృహ హింస కేసులు 402 ఉన్నాయి. వరకట్న వేధింపులు–18, లైంగిక వేధింపులు–6, బాల్య వివాహాలు–2, బాలికలపై లైంగిక వేధింపులు (పోక్సో)–3, ఆస్తి తగాదాలు, వయోవృద్ధులు, ఇతర సమస్యలు–94, మోసం, ప్రేమ పేరుతో మోసగించడం కేసులు–40 ఉన్నాయి. వాటిలో రాజీ అయిన కేసులు–216, విచారణ దశలో–311, శక్తి సదన్, ఇతర గృహాలకు పంపిన కేసులు–38 ఉన్నాయి. అవగాహన సదస్సులు–311 వరకు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
సక్సెస్ స్టోరీ..
ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాకు చెందిన బుస్కి కల్ము, సాతిమండల్తో కలిసి భద్రాచలంలోని సారపాకకు గత నవంబర్లో వచ్చారు.కూలీ పనులు చేస్తూ సహజీవనం చేశారు. మహిళ గర్భం దాల్చింది. ఇంట్లో అమ్మను పెళ్లికి ఒప్పించి తీసుకెళ్తానని చెప్పి వెళ్లిన సాతిమండల్ తిరిగి రాలేదు. గర్భిణికి స్థానిక కారం చిట్టెమ్మ ఆశ్రయం కల్పించింది. అంగన్వాడీ టీచర్ గర్భిణిగా ఉన్న విషయాన్ని మే 4న.. ప్రసవించిన విషయాన్ని మే 19న ఐసీడీఎస్ అధికారులకు తెలిపింది. సంక్షేమ అధికారి స్వర్ణలత లెనీనా, సఖి సెంటర్ అడ్మిన్ సుభశ్రీ, హరికుమారి బృందం చేరుకుని విచారించారు. సదరు మహిళ, బిడ్డను సఖి సెంటర్కు తరలించారు. సాతిమండల్ వివరాలు సేకరించి గ్రామస్తుల సాయంతో సఖి సెంటర్కు తీసుకువచ్చి పెద్దల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. యువతిని పెళ్లి చేసుకుని తీసుకెళ్లేందుకు సాతిమండల్ అంగీకరించాడని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. కాగా, గత మే 29న బుస్కి కల్మును ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ కమిషనర్ అనితారామచంద్రన్ పరామర్శించారు.
కష్టాల్లో ఉన్న వారికి భరోసా
ఆపదలో ఉన్న మహిళలు ఫోన్ చేస్తే సహాయం చేసి న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తాం. రెండేళ్లుగా 565 కేసులు నమోదు కాగా అందులో అత్యధికంగా భార్యభర్తలు విడిపోతామంటూ ఆశ్రయిస్తున్నారు. అందులో ఎక్కువగా వరకట్న వేధింపుల కేసులు ఉన్నాయి. వేధింపులకు గురైన వారు టోల్ ఫ్రీ నంబర్ 181, లాండ్లైన్ 08744 – 248222, సెల్ నంబర్ 86880 05934కు సమాచారం అందించాలి.
–జులుమూరి సుభశ్రీ, అడ్మిన్, సఖి వన్స్టాప్ సెంటర్

అతివలకు అండగా ‘సఖి’

అతివలకు అండగా ‘సఖి’