
‘సతత్ వికాస్’పై అవగాహన
● జాతీయ అవార్డుల దరఖాస్తు ప్రక్రియకు కసరత్తు ● క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ
ఇల్లెందురూరల్: పంచాయతీలను మరింతగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ పేరుతో 2021–22 నుంచి అవార్డులు ఇస్తోంది. ఈ ఏడాది కూడా జాతీయ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణకు కసరత్తు ప్రారంభించింది. దరఖాస్తు ప్రక్రియపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా, మండలస్థాయి అధికారులకు శిక్షణ పూర్తిచేశారు. ప్రస్తుతం ఎంపీడీఓలు గ్రామపంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పిస్తున్నారు. ఒక్కో అంశంలో ఉత్తమ గ్రామపంచాయతీ, మండలం, జిల్లా పరిషత్ను ఎంపిక చేయనున్నారు. కేంద్ర బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తులో పొందుపర్చిన అంశాలను పరిశీలించనున్నాయి. కాగా, త్వరలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది.
తొమ్మిది అంశాలు.. 147 ప్రశ్నలు
ప్రధానంగా తొమ్మిది అంశాల్లో కేంద్ర ప్రభుత్వం వార్డులు ప్రదానం చేయనుంది. ఆయా అంశాల పరిధిలో 147 ప్రశ్నలకు పంచాయతీ కార్యదర్శులు ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. మెరుగైన జీవనోపాధి, వైద్యసేవలు, ఇంటింటికి తాగునీరు, పచ్చదనం, పరిశుభ్రత, మహిళా సంఘాలకు రుణాలు, సామాజిక భద్రత, సుపరిపాలన, మహిళల సమస్యల సాధన, హక్కుల పరిరక్షణ అంశాల్లో అవార్డులు ఇవ్వనున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం
కేంద్ర ప్రభుత్వ అవార్డులకు దరఖాస్తు ఎలా చేసుకోవాలి, ఏఏ అంశాలపై స్పష్టత ఉండాలి, నిబంధనలు, పరిశీలన ప్రక్రియ ఎలా ఉంటాయనే అంశాలపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నాం. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యేలోగా కార్యదర్శులను సన్నద్ధం చేసేందుకు కృషి చేస్తున్నాం.
– ధన్సింగ్, ఇల్లెందు ఎంపీడీఓ

‘సతత్ వికాస్’పై అవగాహన