
ఫలితాల్లో దమ్మపేట ఫస్ట్
● పదో తరగతిలో చివరి స్థానంలో సుజాతనగర్ ● మెరుగైన ఫలితాలు సాధించిన బీసీ వెల్ఫేర్ విద్యార్థులు ● 16 వరకు సప్లిమెంటరీ ఫీజు చెల్లించే అవకాశం ● ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
కొత్తగూడెంఅర్బన్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలుర కంటే బాలికలు అధిక సంఖ్యలో ఉత్తీర్ణత సాధించారు. గత బుధవారం విడుదలైన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా 27వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోల్చుకుంటే జిల్లాలో 1.10 శాతం ఉత్తీర్ణత పెరిగినా రాష్ట్ర స్థాయిలో జిల్లా ఒక స్థానం కిందకు పడిపోయింది. ఐదేళ్లుగా రాష్ట్రస్థాయిలో జిల్లా ఎప్పడూ వెనుకంజలోనే ఉంటోంది. జిల్లా విద్యాధికారులు రూపొందించిన ప్రణాళికలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదనే ఆరోపణలున్నాయి. రాష్ట్రస్థాయిలో జిల్లా ఎప్పడూ 25వ స్థానం కంటే దిగువనే ఉంటోంది. గతేడాది జిల్లాలో నూతనంగా 421 మంది ఉపాధ్యాయులు కొత్తగా నియమితులయ్యారు. డీఎస్సీ–2008 నుంచి మరో 41 మంది వచ్చారు. వీరిలో అన్ని సబ్జెక్ట్ల ఉపాధ్యాయులున్నారు. గతంలో సబ్జెక్ట్ టీచర్ల కొరతతో ఆశించిన ఫలితాలు రాలేదు. ప్రస్తుతం ఉపాధ్యాయులు ఉన్నా, ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించినా చెప్పుకోదగిన విధంగా ఫలితాలు రావడంలేదు. జిల్లాలోని దమ్మపేట మండలానికి ఫలితాల్లో మొదటి స్థానం, సుజాతనగర్కు చివరి స్థానం దక్కింది. వచ్చే విద్యా సంవత్సరంలోనైనా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రతిభ చాటిన బీసీ వెల్ఫేర్ విద్యార్థులు
ఫలితాల్లో బీసీ వెల్ఫేర్ విద్యార్థులు 95.93 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటారు. ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఆర్ఈఎస్, టీడబ్ల్యూఆర్ఎస్ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ఆదర్శంగా నిలిచారు.
ప్రారంభమైన రీ కౌంటింగ్, వెరిఫికేషన్
దరఖాస్తులు
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తులు శుక్రవారం నుంచి ప్రారంభంకాగా, ఈ నెల 15వ తేదీ వరకు గడువు విధించారు. రీ వెరిఫికేషన్ దరఖాస్తులను ఆన్లైన్ చేశాక సంబంధిత కాపీని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు కూడా సప్లిమెంటరీ పరీక్షలు జరుగనుండగా, ఈ నెల 16వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. సప్లిమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు విద్యాధికారులు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో గురువారం ఆన్లైన్ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
ప్రత్యేక తరగతులపై
సూచనలు చేశాం
పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఎంఈఓలకు, ప్రధానోపాధ్యాయులకు సూచనలు చేశాం. విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠశాలల్లో లేదా ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహించాలని సూచించాం. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయాలని తెలిపాం.
– వెంకటేశ్వరాచారి, జిల్లా విద్యాధికారి
పాఠశాలలు ఉత్తీర్ణత శాతం
ఎయిడెడ్ 89.62
ఆశ్రమ 94.06
బీసీ వెల్ఫేర్ 95.93
ప్రభుత్వ 78.48
కేజీబీవీ 89.79
ప్రైవేటు 94.40
రెసిడెన్షియల్ 91.80
మినీ రెసిడెన్షియల్ 94.25
ఎస్డబ్ల్యూఆర్ 93.88
టీడబ్ల్యూఆర్ 94.06
జెడ్పీ 86.46

ఫలితాల్లో దమ్మపేట ఫస్ట్