
బీటీపీఎస్లో సిబ్బంది కొరత
● ఇటీవల మరో 49 మంది కార్మికుల బదిలీ ● రెండు, మూడు పని ప్రదేశాల్లో ఒక్కరికే బాధ్యతలు ● సబ్ ఇంజనీర్లు, కార్మికులపై పెరుగుతున్న పనిభారం
మణుగూరు రూరల్: బీటీపీఎస్ (భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్)లో సిబ్బంది కొరత వెంటాడుతోంది. జెన్ కో యాజమాన్యం సిబ్బంది నియామకాలపై దృష్టి సారించడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా ఉన్న ఉద్యోగులపై తీవ్ర పనిభారం పెరుగుతోంది. బీటీపీఎస్లోని నాలుగు యూనిట్లలో 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. కోల్ ప్లాంట్, యాష్ప్లాంట్, ఈఎస్పీ (ఎలక్రో స్టార్టర్ పెసిఫికేటర్) వంటి ప్రదేశాలు కీలకంగా ఉంటాయి. అలాంటి పని ప్రదేశాల్లోనూ రెండు నుంచి మూడు ప్రదేశాలను ఒక్కరే పర్యవేక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. సబ్ ఇంజనీర్లు పర్యవేక్షించాల్సిన పనులు కూడా పనిఒత్తిడితో కిందిస్థాయి కార్మికులతో చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్లాంట్లో సుమారు 1200 నుంచి 1500మంది ఉద్యోగులు అవసరం ఉండగా, ప్రస్తుతం వెయ్యి మంది మాత్రమే పనిచేస్తున్నారు. తాజాగా మరో 49 మంది బదిలీలతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. పనిభారమైనా విధులు నిర్వహించాలని హుకుం జారీ చేయడం, చిన్న తప్పిదాలకే బాధ్యులను చేస్తూ మెమోలు జారీ చేస్తుండటంపై ఇటీవల ప్లాంట్లో పర్యటించిన సీఎండీకి పలు యూనియన్ల నాయకులు విన్నవించారు.
నియామకాలు చేపట్టకుండా..
నిబంధనల ప్రకారం ఒక్కో పని ప్రదేశంలో కనీసం ఇద్దరు పనిచేయాల్సి ఉంటుంది. ఒకరు అనారోగ్యానికి గురైనా, లేక అవగాహన, అనుభవ లేమి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇద్దరు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తున్నా, ఔట్ సోర్సింగ్ ఉపాధి అవకాశాలు పెంచే పరిస్థితులు ఉన్నా యాజమాన్యం పట్టించుకోవడంలేదు. విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే క్రమంలోనే సిబ్బంది నియామకాలు చేపట్టకుండా, ఉద్యోగులపై పనిభారం పెంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికై నా నియామకాలు చేపట్టి ఉద్యోగులపై పనిభారాన్ని తగ్గించాలని పలువురు కోరుతున్నారు.
సమస్యలు లేకుండా చూస్తున్నాం
ప్లాంట్లో కొంత సిబ్బంది కొరత ఉన్న మాట నిజమే. డిప్యూటేషన్పై వచ్చిన 49 మంది తిరిగి వారి స్థానాలకు వెళ్లారు. సిబ్బంది కొరతతో ఏర్పడుతున్న సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సమస్య ఏర్పడకుండా ఉన్నవారితోనే పనులు చేయిస్తున్నాం. త్వరలో నియమాకాలు చేపట్టే అవకాశం ఉంది.
–బిచ్చన్న, సీఈ

బీటీపీఎస్లో సిబ్బంది కొరత