పడిపోతున్న బియ్యం కొనుగోళ్లు
పాల్వంచరూరల్: నిన్నామొన్నటి వరకు లాభాల పంట పండిన బియ్యం వ్యాపారం డీలా పడుతోంది. రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సన్నబియ్యం ప్రభావంతో కొనుగోళ్లు మందగిస్తున్నాయి. ఈ నెలలో గిరాకీ తగ్గిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. జిల్లాలో సుమారు 300 పైనా బియ్యం దుకాణాలు ఉండగా, పాల్వంచలోనే 50కి పైగా బియ్యం దుకాణాలు ఉన్నాయని, అన్నింటా ఇదే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు, అశ్వాపురం, అశ్వారావుపేట తదితర పట్టణాల్లో బియ్యం దుకాణాలు ఎక్కువగా ఉండగా, వాటిపై ఆధారపడి సుమారు 600 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తున్న విషయం విదితమే. ఒక్కొక్కరికి ఆరు కేజీల చొప్పున అందజేయడంతో లబ్ధిదారులు అందరూ తీసుకుంటున్నారు.
పక్షం రోజులుగా తగ్గిన కొనుగోళ్లు
ఈ నెల ఆరంభం నుంచి సన్న బియ్యం కొనుగోళ్లు తగ్గాయి. ప్రైవేట్ దుకాణాల్లో కేజీ సన్న బియ్యం కొత్తవి రూ.42కు పైగా విక్రయిస్తున్నారు. పాత బియ్యం కేజీ రూ.50 నుంచి రూ.55 చొప్పున అమ్ముతున్నారు. నూకలు కేజీ రూ.28 నుంచి రూ.30 చొప్పున విక్రయిస్తున్నారు. రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో బియ్యం కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయని వ్యాపారాలు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రోజుకు సుమారు రూ.50 లక్షల వ్యయం కలిగిన 10 టన్నుల బియ్యం విక్రయించేవారమని, పక్షం రోజుల నుంచి క్వింటా బియ్యం కూడా అమ్ముడుపోవడం లేదని పేర్కొంటున్నారు.
విక్రయాలపై సన్నబియ్యం పంపిణీ ప్రభావం
గిరాకీ తగ్గిందని చెబుతున్న వ్యాపారులు
కొనుగోళ్లు తగ్గాయి
అనేక సంవత్సరాలుగా బియ్యం వ్యాపారం చేస్తున్నాను. సాధారణంగా రోజుకు 5 నుంచి ఆరు క్వింటాళ్ల బియ్యం విక్రయిస్తా. ఈ నెల 1 నుంచి రోజుకు రెండు క్వింటాలే అమ్ముడవుతున్నాయి. షాపు అద్దె రూ.10వేలు, వర్కర్కు రూ. 10 వేలు, కరెంట్ బిల్లు రూ. వెయ్యి ఎలా చెల్లించాలో అర్థం కావడంలేదు.
–వెంకటేశ్వర్లు, బియ్యం వ్యాపారి
పడిపోతున్న బియ్యం కొనుగోళ్లు
పడిపోతున్న బియ్యం కొనుగోళ్లు


