
మాట్లాడుతున్న రామ్కుమార్ గోపాల్
భద్రాచలంటౌన్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు, ప్రజలు ప్రయాణం చేసే సమయంలో తరలించే ప్రతీ వస్తువుకు ఆధారాలు చూపించాలని, తగిన ఆధారాలు చూపించిన వారికి అనుమతి ఇవ్వాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు రామ్కుమార్ గోపాల్ పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్ర, సర్వే బృందాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లేవారు ఆధారాలు చూపకపోతే సీజ్ చేయాలని ఆదేశించారు. అభ్యర్థులు ప్రచార వాహనాలకు, సభలు, సమావేశాలకు అనుమతి తీసుకోకపోతే కేసులు నమోదు చేయాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్, సర్వైలైన్, వీడియో బృందాలు ప్రతిదీ వీడియో తీసి నోడల్ అధికారికి అందజేయాలని సూచించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏఈఓల కార్యాలయంతో పాటు కూనవరం రోడ్డులోని అంతర్రాష్ట్ర చెక్ పోస్టును వ్యయ పరిశీలకుడు తనిఖీ చేశారు. కార్యక్రమంలో భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్, ఆర్డీఓ దామోదర్రావు, ఏఎస్పీ పరితోష్ పంకజ్, నోడ ల్ అధికారి ఖుర్షద్, ఏఈఓ విద్యాధరరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
చర్యలు తీసుకోవాలి
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని కూనవరం రోడ్డులో ఉన్న చెక్పోస్టు అంతర్రాష్ట్ర సర్వైలెన్స్ టీం పనితీరును శుక్రవారం భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ పరిశీలించారు. అక్రమంగా నగదు, మద్యం రవాణా చేస్తూ ఎవరైనా పట్టుబడితే ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి
భద్రాచలంటౌన్: లోక్సభ ఎన్నికలు ప్రశాతం వాతావరణంలో జరిగేలా ప్రజా ప్రతినిధులు సహకరించాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, భద్రాచలం ఆర్డీఓ దామోదర్రావు సూచించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల్లో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కొత్తగూడెం స్ట్రాంగ్ రూమ్ నుంచి వచ్చే ఈవీఎంలను భద్రాచలం డిగ్రీ కళాశాలలో భద్రపరుస్తామని తెలిపారు. అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ మనిధర్, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఎన్నికల వ్యయ పరిశీలకుడు
రామ్కుమార్ గోపాల్