
ఆ గ్రామంలో అందరూ బంజారాలే. సమీప గ్రామాల్లో భూస్వాముల వద్ద జీతాలు ఉంటూ, పోడు కొట్టుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. ఎన్నాళ్లీ వెట్టి చేయాలనే భావనతో తమ పిల్లలను ఒక్కొక్కరుగా బడికి పంపడం ప్రారంభించారు. వారు చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వారి స్ఫూర్తితో మరికొందరు కొలువులు కొట్టారు. ప్రస్తుతం 70 మంది సర్కారు ఉద్యోగులుగా వివిధ హోదాల్లో స్థిరపడ్డారు. మరో 40 మంది ప్రైవేటు రంగంలో ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు. గ్రామంలో తొలుత 10 కుటుంబాలు ఉండగా, ప్రస్తుతం 140 కుటుంబాలు నివాసముంటున్నాయి.
- భద్రాద్రి కొత్తగూడెం
పునాది వేసిన హనుమానాయక్..
గ్రామంలో బాణోత్ భద్రూనాయక్, బాణోత్ వాలియానాయక్, గుగులోత్ హనుమనాయక్లు గ్రామపెద్దలుగా ఉండేవారు. గుగులోత్ హనుమనాయక్కు మరో ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరిమణులు ఉండేవారు. కుటుంబం మొత్తం వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించేవారు. ఈ క్రమంలో హనుమానాయక్ తన కుమారుడిని, తమ్ముడిని చదివించాలనే ఉద్దేశంతో భద్రాచలంలోని గిరిజన హాస్టల్లో చేర్పించాడు. క్రమంగా వారితోపాటు గ్రామంలోని ఇతర పిల్లలను కూడా హాస్టల్లో చేర్పించేలా ప్రోత్సహించాడు. ఎవరైనా బడి మానేస్తే హనుమానాయక్ వారికాళ్లకు తాడు కట్టి చెట్టుకు తలకిందులుగా వేలాడదీసేవాడని, ఆ భయంతో అందరూ పాఠశాలకు వెళ్లేవారని గ్రామస్తులు చెబుతున్నారు. అప్పుడు శిక్ష బాధ అనిపించినా, అదే తాము జీవితంలో స్థిరపడేందుకు దోహదపడిందని పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పేర్కొంటున్నారు.
తిండి లేకపోయినా చదువులు కావాలా..?
గ్రామంలో ప్రతి కుటుంబం తమ పిల్లలను హాస్టల్లో చేర్పించేది. పేదరికం వెంటాడుతున్నా పిల్లలను మాత్రం బడి మాన్పించేవారు కాదు. తినడానికి తిండి లేకపోయినా పిల్లలకు చదువులు కావాలా? అని కొందరు భూస్వాములు హేళన చేశారని గిరిజనులు పేర్కొంటున్నారు. ఇదే క్రమంలో గ్రామపెద్దలు భద్రాచలంలోని ఐటీడీఏ అధికారులను సంప్రదించి గ్రామస్తులకు రుణాలు మంజూరయ్యేలా కృషి చేశారు. సబ్సిడీపై కరెంటు మోటార్లు, వ్యవసాయ బావులను, గేదెలను ఇవ్వడంతో ఆర్థికంగా వెసులుబాటు కలిగింది. దీంతో పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. హనుమానాయక్ శ్రమ ఫలించింది. కుమారుడు జయరాం ఇంజనీరింగ్ ఉద్యోగం సాధించగా, సోదరుడు వీరస్వామి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డాడు. ఇలా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 70కి చేరింది. వారి స్ఫూర్తితో గ్రామంలోని మరికొందరు ఉద్యోగసాధనలో ముందుకు సాగుతున్నారు.
మా అన్నయ్య ఆశయాలు కొనసాగిస్తాం
గ్రామంలో అందరూ చదువుకోవాలనే మా అన్నయ్య ఆశయాలు కొనసాగిస్తాం. నేను పాఠశాల విద్యను, ఉన్నత విద్యను భద్రాచలం హాస్టల్లో కొనసాగించాను. అప్పుడు లంబాడీలు టీఎన్టీ ట్రైబ్స్గా ఉన్నారు. ఎస్టీ హాస్టళ్లలో ప్రవేశానికి మాకు అవకాశం లేకుండా ఉండేది. మా అన్నయ్య ఐటీడీఏ పీఓ సహాయంతో హాస్టల్లో చేర్పించాడు. ఈ రోజు మా గ్రామంలో ప్రతి ఇంటికి ఒకరు ఉద్యోగులుగా స్థిరపడ్డారు.
–గుగులోత్ వీరస్వామి,ప్రభుత్వ ఉపాధ్యాయుడు
గ్రామాభివృద్ధికి సహకారం..
ఊరు కోసం, కుటుంబం కోసం మా నాన్న హనుమనాయక్ పడిన కష్టం దగ్గరనుంచి చూసి చలించిపోయాను. అదే స్ఫూర్తితో చదివి అటవీ శాఖలో ఉద్యోగం సాధించాను. మా ఊరు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందటానికి నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తాను.
–గుగులోత్ రాంసింగ్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్