ఇంధన ధరలపై ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

ఇంధన ధరలపై ఆగ్రహం

May 19 2026 4:50 AM | Updated on May 19 2026 4:50 AM

● పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంపునకు నిరసనగా రేపల్లె పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్‌ కృష్ణ, పార్టీ నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఎద్దుల బండిపై ద్విచక్ర వాహనాలు ఉంచి వినూత్న రీతిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్డీఓ శ్రీదేవిని కలిసి వినతిపత్రం అందజేశారు. ● వేమూరు నియోకజకవర్గం కొల్లూరులో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంపునకు నిరసనగా వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌ బాబు, పార్టీ శ్రేణులు రిక్షా తొక్కుతూ నిరసన తెలిపారు. పెంచిన పెట్రోలు, డీజిల్‌ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలపై భారం మోపుతూ ఇబ్బందులపాలు చేస్తున్నారని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా అప్పుల పాలు చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం తహసిల్దారు కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ● చీరాల ఆర్డీఓ కార్యాలయం వద్ద వైఎస్సార్‌ సీపీ నేతలు ధర్నా నిర్వహించారు. పెంచిన ధరలు ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ● పెట్రోలు ధరల పెంపుపై పర్చూరులో నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, మండల కన్వీనర్‌ కఠారి అప్పారావు, కారంచెడు మండల కన్వీనర్‌ జువ్వా శివరామ్‌ప్రసాద్‌ పాల్గొన్నారు. తహసీల్దార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.

నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు సామాన్యులపై భారం మోపుతున్న కూటమిపై మండిపాటు పెద్ద ఎత్తున కదిలివచ్చిన శ్రేణులు అధికారులకు వినతిపత్రాలు

ఇబ్బడిముబ్బడిగా పెరిగిన బియ్యం, కందిపప్పు, వంట నూనెలు వంటి నిత్యావసర ధరలు సామాన్యుల జేబులు ఖాళీ చేయగా.. దొరకడమే గగనమైన గ్యాస్‌ బండ నెత్తిన పిడుగులా మారగా.. ఆకాశాన్నంటిన కూరగాయల ధరలతో కుదేలై కుటుంబ పోషణ కష్టంగా మారి, ఏం తినేటట్లు లేం.. ఏం కొనేటట్లు లేమంటూ.. చస్తూ, బతుకుతూ, బతుకీడుస్తున్న సామాన్యుడిపై తాజాగా కూటమి ప్రభుత్వం ‘పెట్రో’ ధరల బాంబు వేసింది. దీనిపై వైఎస్సార్‌ సీపీ సామాన్యుడి తరఫున గళం వినిపించింది. వైఎస్సార్‌ సీపీ శ్రేణులు జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం దెబ్బకు పెరిగిన నిత్యావసరాలతో సామాన్యుడి బతుకు దుర్భరం అయిందని, పెరిగిన ‘పెట్రో’ ధరలతో వారు మరింత కుదేలయ్యారని, వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఇంధన ధరల రూపంలో సామాన్యులపై కూటమి ప్రభుత్వం పెనుభారం మోపడంపై వైఎస్సార్‌ సీపీ భగ్గుమంది. అధిష్టానం పిలుపు మేరకు పార్టీ శ్రేణులు సోమవారం బాపట్ల జిల్లావ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే ఇంధన ధరలు ఎక్కువని నాయకులు మండిపడ్డారు. పెంచిన ధరలను తగ్గించాలని కోరుతూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.

కదంతొక్కిన శ్రేణులు

బాపట్ల పట్టణంలో వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉన్న పెన్షన్లు ఎత్తివేస్తూ, కొత్త పెన్షన్‌లు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోటి రాఘవరెడ్డి, కొక్కిలిగడ్డ చెంచయ్య, ఎం.ఏడుకొండలురెడ్డి, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. తహసీల్దారు సలీమను కలిసి వినతిపత్రం అందజేశారు.

పర్చూరు బొమ్మల సెంటర్‌ వద్ద నిరసన తెలియజేస్తున్న

వైఎస్సార్‌ సీపీ నాయకులు

రేపల్లెలో ఎడ్ల బండిపై ద్విచక్రవాహనాన్ని ప్రదర్శిస్తూ నిరసన తెలియజేస్తున్న సమన్వయకర్త పీటా నాగమోహన్‌కృష్ణ, పార్టీ శ్రేణులు

చీరాల ఆర్డీఓ కార్యాలయం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ పరిశీలకుడు బసవ పున్నారెడ్డి, నాయకులు, కార్యకర్తలు

బాపట్లలో రిక్షా తొక్కి నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు కాగిత సుధీర్‌బాబు, నాయకులు

Advertisement
 
Advertisement
Advertisement