ఎఫ్బీ ఫేక్ అకౌంట్ సృష్టించి అసభ్యకర ఫొటోలు, వీడియోలు అప్లోడ్ నిందితులు నిజం ఒప్పుకున్నా వారిపై చర్యలు తీసుకోని పోలీసులు కళ్లలో కారం చల్లి నాతోపాటు భర్త, తల్లి, కుటుంబ సభ్యులపై దాడి వైఎస్సార్ సీపీ సానుభూతిపరురాలు వేముల శ్రీదేవి ఆవేదన
సత్తెనపల్లి: ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ చెందిన వారిపై టీడీపీ దాడులు పరాకాష్టకు చేరాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ వేముల శ్రీదేవి వైఎస్సార్ సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. ఈక్రమంలో తనపై కక్ష సాధింపు చర్యలగా కూటమికి చెందిన సత్తెనపల్లి నాయకులు తన పేరుతో ఫేస్ బుక్లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అసభ్యకర ఫొటో లు, వీడియోస్ క్రియేట్ చేశారని బాధితురాలు వాపోయింది. సత్తెనపల్లిలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. తనపై ఫేక్ అకౌంట్ క్రియేట్చేసిన వైనంపై గ్రీవెన్స్లో నాలుగు సార్లు ఫిర్యాదు చేశానని.. అయితే నిందితులు నిజం ఒప్పుకున్నా పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా తనను దూషించి అవమానించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ఇలా ఉంటే ఈనెల 25న రాత్రి సమయంలో తన ఇంటి మీదకి ఓ మహిళ, సుమారు 20 మంది పురుషులు వచ్చి ఒక్కసారిగా కళ్లలో కారం చల్లి, సభ్య సమాజం తలదించుకునే రీతిలో దుర్భాషలాడుతూ.. వైఎస్సార్ సీపీలోనే కండువా కప్పుకొని పార్టీలో తిరుగుతావా? వైఎస్సార్ సీపీకి అనుకూలంగా పోస్టులు పెడతావా? అంటూ మాట్లాడటానికి వీలు లేని పదజాలంతో దూషించి దాడి చేశారని ఆవేదన వెలిబుచ్చింది. తన భర్త శ్రీనివాసరావు సెంట్రింగ్ పనిచేస్తూ పని నుంచి వస్తుంటే అతనిపై కూడా దాడి చేశారని, ఎందుకు ఇలా దాడులు చేస్తున్నారో అర్థం కాక సత్తెనపల్లి రూరల్ పోలీస్స్టేషన్కి వెళ్లి తమపై టీడీపీకి చెందిన వారు దాడి చేసేందుకు వచ్చారని ఫిర్యాదు చేస్తే పోలీసులు తమ ఫిర్యాదును స్వీకరించకపోగా .. నువ్వేదో వాళ్లపై పోస్ట్ పెట్టావంట, వాళ్లను తిట్టావంట అంటూ తననే తిరిగి ప్రశ్నించారని, బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకేమాత్రం సంబంధ లేదంటూ మొత్తుకుంటున్నా.. వినకుండా.. తనపై దాడి చేసిన వారికి మాత్రం రాచమర్యాదలు చేసి కూర్చోబెట్టారని, ఇది ఎంతవరకు సమంజసమో అర్థం కావడం లేదని ఆమె ఆవేదన వెలిబుచ్చింది. మహిళలపై దాడి చేసే హక్కు ఏ రాజ్యాంగంలో ఉంది? ఏ చట్టంలో ఉందని ఆమె ఆవేదన వ్యక్తపరిచింది. తన భర్తకు రెండు నెలల బెడ్ రెస్ట్ అని చెబుతున్నారని, ఇలా చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించింది. దాడి చేసిన వారికే పోలీసులు కూడా సహకరిస్తున్నారని ఆవేదన వ్యక్త పరిచింది. ఇప్పటికై నా జరిగిన ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.


