బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి
రేపల్లె: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీడీపీవో ఎం.సుచిత్ర తెలిపారు. బాల్య వివాహ్ మక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా రేపల్లె ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని త్రిబుల్ ఎస్ హైస్కూలులో విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. 18 ఏళ్లలోపు బాలికలకు వివాహాలు చేయరాదని అన్నారు. వివాహానికి బాలికలకు 18 ఏళ్లు, బాలురకు 21 ఏళ్లు నిండాలన్నారు. చిన్న వయస్సులో వివాహాలు జరిగితే భవిష్యత్పై ప్రభావం తీవ్రంగా ఉంటుందని.. విద్య, ఆరోగ్యం, మానసిక స్థితులపరంగా ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన పరిస్థితులు నెలకొంటాయని వివరించారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండి బాలికలు కాన్పు సమయంలో మృతి చెందే అవకాశాలు అధికంగా ఉంటాయన్నారు. తమ సమీపంలో బాల్య వివాహాలు చోటుచేసుకుంటే 1098 చైల్డ్ హెల్ప్లైన్ నంబరుకు ఫిర్యాదు చేయాలన్నారు. అనంతరం బాల్య వివాహాల నిర్మూలన చట్టాలపై ఇన్చార్జి హెచ్ఎం కె.పుల్లారావు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సీహెచ్ హిమబిందు, ఉపాధ్యాయులు సత్యనారాయణ, కృష్ణారావు, సరిత, శివకోటేశ్వరరావు, అంగన్వాడీ కార్యకర్తలు హెల్డా, స్వప్న, అనిత, వరలక్ష్మి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.


