
డీఏ జీఓలను వెంటనే సవరించాలి
నరసరావుపేట ఈస్ట్: ఉద్యోగులకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాని 60, 61 జీఓలకు వెంటనే సవరించాలని ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసెఫ్ సుధీర్బాబు డిమాండ్ చేశారు. రాష్ట్రోపాధ్యాయ సంఘం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యవర్గ అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లతో మంత్రివర్గ ఉపసంఘం, సీఎం స్థాయిలో పలు విడతలుగా చర్చించి విడుదల చేసిన జీఓలు హాస్యాస్పదంగా, ప్రపంచ బ్యాంక్ షరతులకు తలొగ్గినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. ఉద్యోగులకు దీపావళి కానుకగా డీఏ వస్తుందని ఆశపడ్డారని, కానీ జీఓలలో డీఏ బకాయిలు పదవి విరమణ అనంతరం చెల్లిస్తామనటం హాస్యాస్పదమన్నారు. జీఓలలో సీపీఎస్ వారి గురించి కనీస సమాచారం లేదనీ, పెన్షనర్లకు డీఏ ఎరియర్ చెల్లింపులు 2027–28 సంవత్సరం నుంచి 12 విడతలుగా విడుదల చేస్తామనటం హక్కులను కాలరాయటమేనని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే జీఓలను సవరించి ఉద్యోగుల డీఏ ఎరియర్ను వారి పీఎఫ్ ఖాతాలకు జమచేయాలనీ, సీపీఎస్ వారికి 90 శాతం నగదు, పెన్షనర్లకు డీఏ ఎరియర్స్ వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్ని సంఘాలను కలుపుకొని కార్యాచరణ రూపొందించి నిరసనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు డి.పెదబాబు, డి.కె.సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి
సుధీర్బాబు