
భర్త ఇంటి ముందు భార్య నిరసన
చీరాల: భర్త ఇంటి ముందు భార్య బుధవారం నిరసనకు దిగింది. చీరాల మండలం బోయినవారిపాలేనికి చెందిన చంద్రశేఖరరావుతో వేటపాలెం మండలం బచ్చులవారిపాలేనికి చెందిన మహిళకు రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది. చంద్రశేఖరరావు బాపట్ల ఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే కట్నం కోసం వేధింపులు చేస్తున్నట్లు మహిళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గత కొంత కాలంగా ఈ వ్యవహారం జరగడంతో చంద్రశేఖరరావు ఇంటికి తాళం వేసి బాపట్లలో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఆమె ఇంటి ముందు బైఠాయించి న్యాయం చేయాలంటూ నిరసన తెలిపింది.
బల్లికురవ: వారం రోజుల క్రితం అదృశ్యమైన వివాహిత మృతదేహం మంగళవారం రాత్రి అద్దంకి బ్రాంచ్కాలువ వైదన సమీపంలో లభ్యమైంది. బల్లికురవ ఎస్ఐ వై.నాగరాజు అందించిన వివరాలు.. పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన కర్రి పార్వతి(44) ను వినుకొండ మండలం పిట్టంబండ గ్రామానికి చెందిన నాగేశ్వరరావుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరి పిల్లలు. ఈనెల 7వ తేదీ సాయంత్రం శావల్యాపురం మండలం గంటావారిపాలెం గ్రామంలోని లక్ష్మీ తిరుపతమ్మ ఆలయానికి నిద్ర చేసేందుకు వచ్చింది. 8వ తేదీ ఉదయం అద్దంకి బ్రాంచ్ కాలువలో స్నానానికి వెళ్లి ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయింది. భార్య ఇంటికి రాకపోవటంతో భర్త, కుటుంబ సభ్యులు వెతుకుతూ మంగళవారం శావల్యాపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా మృత దేహం కాలువలోపడి వైదన వద్దకు కొట్టుకొచ్చింది. అక్కడ పొలాల్లోని రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఇంటి నుంచి వెళ్లిపోయిన కొడుకు
కారంచేడు: ఖాళీగా ఉండటం ఎందుకు.. ఏదో ఒక పనిచేసుకొని నాలుగు రాళ్లు సంపాదించవచ్చు కదా. అని అన్నందుకు తండ్రిపై కొడుకు అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బంధువులు, స్నేహితుల వద్ద విచారించినా కనపడకపోవడంతో పోలీసులకు బుధవారం తండ్రి ఫిర్యాదు చేశాడు. కారంచేడు ఎస్ఐ షేక్ ఖాదర్బాషా తెలిపిన వివరాలు.. మండలంలోని తిమిడెదపాడు గ్రామానికి చెందిన తమ్మల ప్రసాద్కు ముగ్గురు సంతానం కాగా ఇద్దరికి వివాహాలు చేశాడు. మూడో కుమారుడైన జయప్రకాశ్ ఈనెల 14వ తేదీ ఉదయం 10 గంటల నుంచి కనిపించకుండా పోయాడు. ఐటీఐ పూర్తి చేసిన జయప్రకాశ్ కొన్ని రోజులు హైదరాబాద్లో ఉండి ఉద్యోగం చేశాడు. తనకు బెంగగా ఉందని ఇంటికి రమ్మని తండ్రి కోరడంతో తిరిగి ఇంటికి వచ్చాడు. అయితే వచ్చిన దగ్గర నుంచి ఏ పనికీ వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండటంతో తండ్రి మందలించి పనులు చేసుకోవాలని సూచించాడు. దీంతో అతను అలిగి పారిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మార్టూరు: ఆర్థిక ఇబ్బందులతో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఉరివేసుకొని మృతి చెందిన ఘటన మండలంలోని జొన్నతాళి సమీపంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఒడిశాలోని భద్రక్ జిల్లా ఉగల్ పూర్ గ్రామానికి చెందిన ప్రదీప్ థాల్(55) కొంతకాలంగా స్థానిక జాతీయ రహదారి పక్కన జొన్నతాళి స్టేజీ సర్వీస్ రోడ్డులో ఫ్యాన్సీ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వ్యాపారం బాగా జరగని కారణంగా ఆర్థిక ఇబ్బందులు పెరిగి మనస్తాపానికి గురై బుధవారం మధ్యాహ్నం తను నివాసం ఉండే రేకుల షెడ్డుకు ఇనుప రాడ్డుకు తాడుతో ఉరి వేసుకొని మృతి చెందాడు. సాయంత్రం గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

భర్త ఇంటి ముందు భార్య నిరసన