
రోడ్డు ప్రమాదంలో రైతు మృతి
కర్లపాలెం: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ఓ రైతు మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. కర్లపాలెం ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల మేరకు... కాకుమానుకు చెందిన దొప్పలపూడి చంద్రపాల్(61) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం వరినారు కోసం ద్విచక్రవాహనంపై బాపట్ల మీదుగా కర్లపాలెం వస్తున్నాడు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం సమీపంలో వెనుక నుంచి వచ్చిన ట్రక్ ఆటో ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో చంద్రపాల్ తీవ్రంగా గాయపడటంతో అతనిని మొదటిగా బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో చంద్రపాల్ మృతిచెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుని కుమారుడు అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రవీందర్ తెలిపారు.
కొల్లూరు : వేగంగా దూసుకొచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ చిరు వ్యాపారి తీవ్రంగా గాయపడి ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడు. మండలంలోని బొద్దులూరుపాడుకు చెందిన కొల్లూరు వెంకట నరసయ్య (68) గ్రామంలో కిరాణా షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం కొల్లూరులో సామగ్రిని కొనుగోలు చేసుకొని, మోపెడ్పై గాంధీనగర్లో నివసిస్తున్న కుమార్తెను చూసేందుకు వెళుతున్నారు. ఈ సమయంలో తెనాలి వైపు నుంచి అతి వేగంగా దూసుకొచ్చిన ఓ ద్విచక్ర వాహనదారుడు నరసయ్య వాహనాన్ని ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను కుమార్తె 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి నరసయ్య మృతి చెందాడు. వైద్యశాల నుంచి వచ్చిన నివేదిక మేరకు కొల్లూరు పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ జానకీ అమరవర్ధన్ తెలిపారు.
కారంచేడు: మార్టూరు నుంచి చీరాలకు సరిహద్దు రాళ్ల లోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ నష్టం జరగలేదు. ఆదివారం వాడరేవు–పిడుగురాళ్ల ప్రధాన రహదారిలో.. కారంచేడు అంబేడ్కర్ నగర్ కాలనీ సమీపంలో ఈ ఘటన జరిగింది. ట్రాక్టర్ ట్రక్కు వెనుక టైర్లకు బేరింగ్లు ఊడిపోవడంతో ఒక్క సారిగా తిరగబడింది. ఆ సమయంలో ఇతర వాహనాలు అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ట్రాక్టర్ కూడా నిదానంగా ప్రయాణిస్తుండటంతో కేవలం ట్రక్కు మాత్రమే బోల్తా పడింది. దీంతో రాళ్లు ప్రధాన రహదారిలో పడటంతో వాహన ప్రయాణాలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. స్థానిక ఏఎస్ఐ శేషసాయి సిబ్బందితో అక్కడకు చేరుకొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.
తెనాలి రూరల్: విద్యుదాఘాతంతో బిహార్కు చెందిన కూలీ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బిహార్కు చెందిన ఓం ప్రకాష్(41) నాలుగేళ్లుగా మండలంలోని ఖాజీపేటలోని ప్లాస్టిక్ రీసైక్లింగ్ కంపెనీలో పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం కంపెనీలోని డ్రయ్యర్ను శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై వెనక్కు పడడంతో తలకు తీవ్ర గాయమైంది. తెనాలిలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో రైతు మృతి