
అమెరికా సుంకాలతో ఆక్వాకు ముప్పు
వేటపాలెం: అమెరికా.. భారత్పై విధించిన సుంకాలు ఆక్వా రంగానికి పెను ముప్పుగా తయారయ్యాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘ట్రంప్ సుంకాలు– ఆక్వా రంగంపై ప్రభావం’ అనే అంశంపై రామన్నపేట పంచాయతీ.. రావూరిపేట శివారులోగల ఆక్వా అసోసియేషన్ కార్యాలయంలో ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యాన మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆక్వా అసోసియేషన్ అధ్యక్షుడు తేళ్ల రామయ్య అధ్యక్షత వహించారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమెరికా ఆంక్షలను తిప్పి కొట్టాలని డిమాండ్ చేశారు. సుంకాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ప్రస్తుతం ఆక్వా రంగం కష్టకాలంలో ఉందన్నారు. ఆక్వా రంగాన్ని, వ్యవసాయ రంగంగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమెరికా మన దేశ ఎగుమతులపై భారీ సుంకాలు విధించడం వల్ల వ్యవసాయం, అనుబంధ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. మరోవైపు సుంకాలు అమలు ప్రారంభం కాకపోయినా రాష్ట్రంలో వ్యాపారులు అన్ని కౌంట్ రొయ్యల ధరలు తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహించడం లేదని విమర్శించారు. అసోసియేషన్ అధ్యక్షుడు తేళ్ల రామయ్య మాట్లాడుతూ రొయ్యల కొనుగోలు, ఫీడ్ తయారీ.. పిల్ల సప్లై కంపెనీలు వివిధ రాజకీయ నాయకుల కనుసన్నల్లో నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వాలు వారితోనే చర్చలు, సంప్రదింపులు జరిపి సామాన్య రైతులకు గిట్టుబాటు ధరలు రాకుండా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమంచి స్వాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రైతులకు విద్యుత్ యూనిట్ ధర రూపాయిన్నర తగ్గించాలని, ఈ రంగంపై వేస్తున్న భారాలను తగ్గించాలని, ఫీడ్ ముడి పదార్థ ధరలు తగ్గించాలని కోరారు. రొయ్యల ధరలు నిర్దిష్టంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉందన్నారు. ఆక్వా రైతు పల్లపోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశీయ మార్కెట్ను పెంచుకునే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. మధ్మాహ్న భోజనం పథకం, హాస్టల్స్ మిలిటర్ మెనూలో రొయ్యలను చేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు సూర్యనారాయణ, ప్రకాశం జిల్లా సంఘం అధ్యక్షుడు జె.జయంతిబాబు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తలపల రామారావు, కౌలు రైతు సంఘం కార్యదర్శి పి.కొండయ్య, చీరాల డివిజన్ సీఐటీయూ నాయకులు నలతోటి బాబూరావు, మండల నాయకులు మచ్చా అయ్యప్పరెడ్డి, రొయ్యల రైతులు రాంబాబు, జరుగు రమేష్, జగదీష్, ముంగర వెంకటరామయ్య, మోటుపల్లి శంకర్, మద్దినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో రైతుల ఆవేదన