
ప్రమాదవశాత్తు సివిల్ ఇంజినీర్ మృతి
నవీపేట: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని కోస్లీ గ్రామ సమీపంలోని చెరువులో పడి ప్రైవేట్ సివిల్ ఇంజినీర్ గుత్తి ఉమా గణేశ్(30) మృతి చెందినట్లు ఎస్ఐ వినయ్ శనివారం తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం గ్రామానికి చెందిన ఉమా గణేశ్ భైంసా నుంచి బోధన్ వరకు జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులలో సివిల్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అనూష ప్రాజెక్ట్లో కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్న గణేశ్, నిర్మల్ జిల్లా బాసరలోని కార్యాలయంలో ఉంటూ విధులకు వెళ్లేవాడు. కోస్లీ శివారులో మొరం తవ్వకాలు జరగడంతో పర్యవేక్షణకు శుక్రవారం సాయంత్రం బైక్పై వెళ్లి తిరిగి రాలేదు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడని ఎస్ఐ వినయ్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు. మృతుని తండ్రి మల్లేశ్వర్రావుకు సమాచారం అందించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్
తెనాలి రూరల్: దివ్యాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడి కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా వందవాసి మండలం పొదిరి గ్రామానికి చెందిన కొంతమంది 2022లో తెనాలి మండలం అంగలకుదురులో కూలి పనుల కోసం వచ్చి, కొన్ని రోజులు ఇక్కడ నివాసం ఉన్నారు. వీరితో వచ్చిన ఆరు గోపి అప్పట్లో మతిస్థిమితం లేని దివ్యాంగురాలైన 21 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబసభ్యులు విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. బెయిల్పై బయటకు వచ్చిన నిందితుడు గోపి శిక్ష పడుతుందన్న భయంతో కోర్టు వాయిదాలకు రాకుండా తమిళనాడులో ఉంటున్నాడు. పోలీసులు అతడిని తమిళనాడు నుంచి తీసుకువచ్చి గుంటూరు కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్ విధించారు. నిందితుడి ఆచూకీ గుర్తించడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐ డి. శ్రీనివాసరావు, ఏఎస్ఐ వెంకటరమణ, సీపీ సుబ్బారెడ్డిని పోలీసు అధికారులు అభినందించారు.

ప్రమాదవశాత్తు సివిల్ ఇంజినీర్ మృతి