
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
చీరాల అర్బన్: ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు అమలు కాని హామీలను గుప్పించి అధికారం చేపట్టిన తర్వాత హామీలను విస్మరించి ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు బహుముఖ ప్రజ్ఞాశాలి అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున అన్నారు. శనివారం సాయంత్రం చీరాల మండలంలోని రామకృష్ణాపురంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో ‘బాబు ష్యూరిటీ –మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అంశంపై నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. నాగార్జున మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. సూపర్ సిక్స్ గురించి ప్రశ్నిస్తే నాలుక కట్ చేస్తామని చంద్రబాబు అనడం ఆయన అహంకారానికి నిదర్శమన్నారు. తల్లికి వందనం పేరుతో రూ.15వేలు ఇస్తానని చెప్పి రూ.2 వేలు తగ్గించి జమ చేశారన్నారు. సాకుల పేరుతో చాలా మందికి డబ్బులు జమ కాలేదన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను మూలన పెట్టేశారన్నారు. సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. పొగాకు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. జిల్లా పరిశీలకులు, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారన్నారు. అధికార పార్టీ పెట్టే అక్రమ కేసులపై ఎవరూ భయపడవద్దని, పార్టీ అందరికి అండగా ఉంటుందన్నారు.
పథకాల్లో ఎన్నో కోతలు
వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. హామీలు అమలు చేయడంలో చిత్తశుద్ధి లేదన్నారు. గత ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేసి నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బులు జమ చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికి తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. అనంతరం చంద్రబాబు మోసాలను తెలియజేసే క్యూఆర్ కోడ్ కలిగిన పత్రాలను ఆవిష్కరించారు. దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీరక సురేంద్ర క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏవిధంగా ప్రజలకు వివరించాలనేది పవర్ పాయింట్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కర్నేటి వెంకట ప్రసాద్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జైసన్బాబు, బీసీ జిల్లా అధ్యక్షుడు గవిని శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ళ వాసు, మున్సిపల్ విభాగం అధ్యక్షుడు బత్తుల అనిల్, చీరాల మండల అధ్యక్షుడు ఆసాది అద్దంకిరెడ్డి, వేటపాలెం మండల అధ్యక్షుడు సాధు రాఘవ, పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, మైనార్టీ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ షేక్ కబీర్, జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు కోడూరి ప్రసాద్రెడ్డి, వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ చీరాల అధ్యక్షుడు రాజు శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ బిట్రా శ్రీనివాసరావు, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు కావూరి రమణారెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఆసాది అంకాలరెడ్డి, వేటపాలెం పార్టీ మాజీ అధ్యక్షుడు బొడ్డు సుబ్బారావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మోసం చేయడంలో బాబు బహుముఖ ప్రజ్ఞాశాలి రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున చీరాలలో ‘బాబు ష్యూరిటీ –మోసం గ్యారెంటీ’ కార్యక్రమం