ఎట్టకేలకు సీనియార్టీ లిస్టులు | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు సీనియార్టీ లిస్టులు

Jun 30 2025 4:11 AM | Updated on Jun 30 2025 4:11 AM

ఎట్టకేలకు సీనియార్టీ లిస్టులు

ఎట్టకేలకు సీనియార్టీ లిస్టులు

నెహ్రూనగర్‌: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని యూఎల్‌బీ పరిధిలో పనిచేస్తున్న వార్డు ఎనిమిటీ సెక్రటరీలు, వార్డ్‌ ప్లానింగ్‌ సెక్రటరీల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ ఆదివారం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగింది. శనివారం వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ, వార్డు శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీలకు కౌన్సెలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. అయితే శనివారం జరిగిన కౌన్సెలింగ్‌లో ఎటువంటి సీనియార్టీ లిస్ట్‌ పెట్టకుండానే నచ్చిన సచివాలయాలను మూడు ఆప్షన్లుగా ఎంచుకుని ఆప్షన్‌ ఫాం ఇచ్చి వెళ్లిపోండి ఈనెల 30న మీకు సచివాలయం కేటాయిస్తామని అధికారులు చెప్పిన విషయం విధితమే.. దీనిపై ‘సచివాలయ ఉద్యోగుల్లో ట్రాన్స్‌‘ఫియర్‌’’ అనే శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు రెండో రోజు జరగాల్సిన వార్డు ఎమినిటీ సెక్రటరీ, ప్లానింగ్‌ సెక్రటరీలకు కౌన్సెలింగ్‌కు సంబంధించిన సీనియార్టీ లిస్ట్‌ను ప్రచురించారు.

వార్డు అడ్మిన్లు వర్సెస్‌ బిల్‌ కలెక్టర్లు

2019లో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వార్డు/గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సచివాలయాలకు వార్డు అడ్మిన్‌ సెక్రటరీలతో పాటు గుంటూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న బిల్‌ కలెక్టర్లను కూడా వార్డు అడ్మిన్‌ సెక్రటరీలుగా అవకాశం కల్పిస్తూ పోస్టింగ్‌ ఇచ్చారు. 2019లో బిల్‌ కలెక్టర్లకు వార్డు అడ్మిన్‌ సెక్రటరీలుగా ముందు ప్రాధాన్యత కల్పించి పోస్ట్‌ కేటాయించారు. అయితే ప్రస్తుతం బదిలీల కౌన్సెలింగ్‌ జరగుతున్న నేపథ్యంలో బిల్‌ కలెక్టర్లు వారు ప్రస్తుతం పనిచేస్తున్న సచివాలయాల్లోనే ఉండేవిధంగా ఉన్నతాధికారులతో మాట్లాడి వాటిని హోల్డ్‌ చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వార్డు అడ్మిన్‌ సెక్రటరీలు అలా హోల్డ్‌ చేసుకోవడం కుదరదంటూ సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. నగరపాలక సంస్థ పరిధిలో సుమారు 23 మంది బిల్‌ కలెక్టర్లు వార్డు అడ్మిన్‌ సెక్రటరీలుగా పనిచేస్తున్నారు. వీరంతా తాము ఐదేళ్ల నుంచి వార్డు అడ్మిన్‌ సెక్రటరీలుగా పనిచేస్తున్నామని, తమకు ప్రాధాన్యత ఇచ్చి నచ్చిన సచివాలయం కేటాయించాలని కోరుతుండగా.. అధికారులు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. ఈ బదిలీల కౌన్సెలింగ్‌ ఒక కొలిక్కి రావాలంటే సోమవారం వరకు వేచి చూడాల్సిందేనని జీఎంసీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement