
హత్యాయత్నం కేసులో ఆరుగురికి జైలు శిక్ష
అద్దంకి: ఇద్దరు వ్యక్తులపై ఆరుగురు హత్యాయత్నం చేసిన కేసులో నిందితులపై నేరం రుజువు కావడంతో జడ్జి ఒక్కొక్కరికి 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.17 వేల చొప్పున జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించినట్లు సంతమాగులూరు ఎస్సై పట్టాభి తెలిపారు. కేసు వివరాలు.. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలోని కుందుర్రు గ్రామానికి చెందిన బొమ్మినేని కృష్ణయ్యతో నిందితులు జడ వెంకటేశ్వర్లు, జడ వీరాంజనేయులు, జడ వెంకట్రావు, జడ శ్రీనివాసరావు, జడ గోపి, కొనికి యోగయ్యలకు పాత గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో 2020 నవంబర్ 11న కృష్ణయ్య, ఆయన బాబాయి వీరాస్వామి కొమ్మాలపాడు వెళ్లి పని అయిన తర్వాత తిరిగి కుందుర్తికి బయలుదేరారు. కొమ్మాలపాడు ఎన్ఎస్పీ కెనాల్ వద్ద నిందితులు కాపు కాచి మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. కృష్ణయ్య కాలు, వీరాస్వామికి చెయ్యి విరిగాయి. తీవ్ర గాయాలైన వారిని 108 అంబులెన్స్లో హాస్పిటల్కు తరిలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు అప్పట్లో ఈ ఘటనపై సంతమాగులూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి.శివన్నారాయణ హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి సంబంధిత కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. నిందితులకు 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ.17 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం అద్దంకి కోర్టు న్యాయమూర్తి డి. నాగ వెంకటలక్ష్మి తీర్పు వెలువరించారు.