
ఆటో ఢీకొని ఒకరికి గాయాలు
కొల్లూరు: ఆటో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో వాహనదారుడు తీవ్ర గాయాలబారిన పడిన ఘటన మండలంలోని పెదలంక వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, క్షతగాత్రుడి బంధువుల కథనం మేరకు.. చుండూరుకు చెందిన పడాల సప్తగిరి మండలంలోని సుగ్గునలంకకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న సప్తగిరి అత్తగారి ఇంట్లో ఉన్న భార్య వద్దకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. మండలంలోని పెదలంక వద్ద ఎదురుగా కనిగిరిలంక వైపు నుంచి వస్తున్న ఆటో సప్తగిరి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆటోకు సంబంధించిన ఇనుప బద్దె ద్విచక్ర వాహనదారుడి తొడలో నుంచి వెనుక తుంటిపై భాగం నుంచి బయటకు చొచ్చుకువచ్చింది. స్థానికులు వ్యక్తి తొడలోంచి చొచ్చుకు వెళ్లిన ఇనుప బద్దెను తమ వద్ద అందుబాటులో ఉన్న పరికరాలతో కట్ చేసి 108లో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు క్షతగాత్రుడి తొడ ప్రాంతం నుంచి చొచ్చుకొని వెళ్లిన ఇనుప బద్దెను తొలగించారు. శరీరం అంతర్భాగంలో ఉన్న కొని అవయవాలు దెబ్బతిన్నట్లు వైద్యులు సూచించడంతో క్షతగాత్రుని బంధువులు మెరుగైన వైద్యసేవల కోసం గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగానే ఉన్నట్లు బంధువులు చెప్పారు.
తొడలో దిగిన ఇనుప బద్దె తొలగించిన వైద్యులు

ఆటో ఢీకొని ఒకరికి గాయాలు