
స్కూల్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు తప్పనిసరి
జిల్లా ట్రాన్స్ఫోర్ట్ అధికారి కె. పరంధామరెడ్డి
బాపట్లటౌన్: పాఠశాలలు, కళాశాలల స్కూల్ బస్సులకు తప్పని సరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని జిల్లా ట్రాన్స్ఫోర్ట్ ఆఫీసర్ కె. పరంధామరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. స్కూల్ పిల్లల విషయంలో అశ్రద్ధ తగదని, ఫిట్నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ చేయించుకోవాలన్నారు. వాహనాలు రిపేరుకు గురైతే తక్షణమే రిపేర్లు కంప్లీట్ చేయించుకొని ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిని డ్రైవర్లుగా నియమించవద్దని సూచించారు. డ్రైవర్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అర్హులైన డ్రైవర్లను మాత్రమే బస్సులను నడిపేందుకు అనుమతించాలన్నారు. మద్యం తాగి, సెల్ ఫోన్ నడుపుతూ వాహనాలను నడపవద్దని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడువుతూ తమ తనిఖీలలో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కేంద్ర ఆరోగ్య పథకం
ఎల్ఏసీ మెంబర్గా గుమ్మడి
లక్ష్మీపురం: సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ లోకల్ అడ్వైజరీ కమిటీ(ఎల్ఏసీ) సభ్యునిగా గుంటూరుకు చెందిన విశ్రాంత సెంట్రల్ జీఎస్టీ సూపరింటెండెంట్ గుమ్మడి సీతారామయ్యని నియమిస్తూ సీజీహెచ్ఎస్ అడిషనల్ డైరెక్టర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తరఫున నియమితులైన సీతారామయ్యని శుక్రవారం సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్ కన్నవారితోటలోని కార్యాలయంలో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మల్లిక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య పరిరక్షణకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా సీతారామయ్య కృషి చేయాలని సూచించారు. సీజీహెచ్ఎస్ పరిధిలోకి మరిన్ని ఎంప్యానల్డ్ ఆసుపత్రులను తీసుకురావాలని కోరారు. డిపార్ట్మెంట్కు చేసిన సేవలు అందించిన సీతారామయ్యకు ఈ హోదా దక్కడం శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు.విశ్రాంత జీవితంలో సేవ చేసే బాధ్యత ఇచ్చిన సీజీహెచ్ఎస్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ రోహిణికి సీతారామయ్య కృతజ్ఞతలు తెలిపారు.