
రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమ కేసులు
వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గణేష్
రేపల్లె: రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో కుటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోందని వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ విమర్శించారు. గుళ్లపల్లిలోని పార్టీ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డైవర్షన్ పాలిటిక్స్తో ప్రజలను పక్కదోవ పట్టిస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా తప్పుడు కేసులు బనాయించి అణగద్రొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పోలీసులను పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటూ రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తుందన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అదరరు బెదరరు అన్నారు. పార్టీ అధినేత పిలుపు మేరకు ప్రజా సమస్యలపై ప్రజలతో నిత్యం పోరాటాలు చేస్తూనే ఉంటామన్నారు.
జగన్పై కేసులు రాజకీయ కుట్రపూరితమే
రాజకీయ కక్ష సాధింపు, కుట్రలలో భాగంగానే వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని విమర్శించారు. పల్నాడు పర్యటనలో భాగంగా గుంటూరు సమీపంలో ప్రమాదవశాత్తూ సింగయ్య మృతి చెందితే కూటమి ప్రభుత్వం తమ రాజకీయ కక్షకు వాడుకుంటోందన్నారు. ప్రమాదం జరిగిన రోజు సాక్షాత్తూ ఆ జిల్లా ఎస్పీనే ప్రమాదానికి మాజీ సీఎం జగన్ కాన్వాయ్కు సంబంధం లేదని, ప్రైవేటు వాహనం ఢీకొనటంతో సింగయ్య మృతి చెందినట్లు తాము గుర్తించామని బహిరంగంగా ప్రకటించారన్నారు. ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తేవటంతో ఎస్పీ మాట మార్చి జగన్మోహన్రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారన్నారు. కుట్రలో భాగంగా జగన్మోహన్రెడ్డికి చెందిన బులెట్ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేయటం తగదన్నారు. ఇప్పటికై నా కూటమి పాలకులు రాజకీయ కక్ష సాధింపులు వీడి ప్రజాసంక్షేమంపై దృష్టి సారించాలని హితవు పలికారు. లేనిపక్షంలో భవిష్యత్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.