
అమ్మో.. కిలేడీ కిల్లర్స్!
తెనాలి: గతేడాది జూన్లో స్థానిక యడ్ల లింగయ్య కాలనీకి చెందిన రజిని, తనకు పరిచయస్తురాలైన నాగూర్బీని ఆటోలో ఎక్కించుకుని తెనాలి–నారాకోడూరు రోడ్డులోని వడ్లమూడి వద్ద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది. మార్గమధ్యంలో ఆటో డ్రైవర్తో రజిని బ్రీజర్ కొనిపించింది. అదే కాలనీవాసి వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి బైకుపై వీరిని వెన్నంటి వచ్చింది. ముగ్గురూ నిర్మాన్యుష ప్రదేశానికి వెళ్లారు. అక్కడ బ్రీజర్లో సైనేడ్ కలిపి నాగూర్బీకి ఇచ్చారు. ఆ వెంటనే ఆమె చనిపోయింది. ఒంటిపై బంగారు ఆభరణాలను దోచుకుని రజిని, వెంకటేశ్వరి తాపీగా ఇంటికి వచ్చారు. నాగూర్బీ మృతదేహం వెలుగులోకి రావడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్ను గుర్తించి ప్రశ్నించడంతో రజని గురించి చెప్పాడు. ఆమెను తీసుకొచ్చి విచారించాక మరిన్ని సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి. నాగూర్బీ హత్యనే కాదు..రజని, వెంకటేశ్వరితోపాటు ఆమె తల్లి రమణమ్మ కలిసి 2022 నుంచి మరో ముగ్గురిని సైనేడ్తో హత్య చేశారని, వీరి అరెస్టు చూపుతూ జిల్లా ఎస్పీ సతీష్కుమార్ చెప్పారు.
అప్పు ఎగ్గొట్టేందుకు హత్య
మార్కాపురానికి చెందిన సుబ్బలక్ష్మిని ఆమె ఆస్తి, డబ్బులు, బంగారు ఆభరణాలు కోసం ఇదే తరహాలో మద్యంలో సైనేడ్ కలిపి ఇచ్చి చంపారు. వెంకటేశ్వరికి సుబ్బలక్ష్మి స్వయాన అత్త అవుతుంది. ఆ తర్వాత 2023లో నాగమ్మ అనే మహిళను థమ్సప్లో సైనేడ్ కలిపి హతమార్చారు. ఆమె వద్ద తీసుకున్న రూ.20 వేల అప్పు ఎగ్గొట్టేందుకు చంపేశారు.
భార్యతో చేతులు కలిపి హత్యకు పథకం
తెనాలికి చెందిన పీసు అలియాస్ మోషే తరుచూ భార్యను వేధిస్తున్నాడు. అతన్ని చంపేందుకు భార్యతో చేతులు కలిపి 2024లో మద్యంలో సైనేడ్ కలిపారు. అతను చనిపోయిన తర్వాత వచ్చే పెన్షన్, ఇన్స్యూరెన్స్ డబ్బులు పంచుకునేందుకు ఆమెతో అగ్రిమెంట్ కుదర్చుకున్నారు. ఈ నాలుగు హత్యలే కాకుండా మరో ముగ్గురిపై హత్యాయత్నం చేశారు. చివరిసారి పథకం పారలేదు. అప్పులు ఎగ్గొట్టడం, వారి వద్ద నున్న బంగారు ఆభరణాలు దోచుకోవాలన్న ఉద్దేశంతోనే సైనేడ్ కలిపి హత్యలు చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ వెల్లడించారు. వీరికి సైనేడ్ విక్రయించిన నేరంపై మరొకరిని అరెస్టు చేశారు.
ఆడతనానికి మాయని మచ్చ !
ఆభరణాల కోసం హత్యలు
చేస్తున్న మహిళలు
నాడు సైనేడ్తో నలుగురి హత్య
నేడు దాడిచేసి ముగ్గురి హత్య
అన్నీ పట్టపగలు..
బెరుకులేని దారుణాలు
పోలీసుల అప్రమత్తతతో జైలుపాలు

అమ్మో.. కిలేడీ కిల్లర్స్!