
సీ మౌత్ను ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాల
బాపట్లటౌన్: ఈపురుపాలెం స్ట్రైట్కట్ సీ మౌత్ కాలువను ఆక్రమించిన భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని సీపీఎం కేంద్రకమిటీ సభ్యురాలు డి.రమాదేవి డిమాండ్ చేశారు. తీరప్రాంతం ఆక్రమణకు గురైన సీమౌత్ను శుక్రవారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ శ్రీ భ్రమరా డెవలపర్స్ సారథ్యంలోని ఆలోహ రిసార్ట్స్ కోసం ఇక్కడ సహజ సిద్ధంగా ఎల్ ఆకారంలో ఉన్న సీ మౌత్ ప్రాంతాన్ని సుమారు 15.35 ఎకరాలు పీడబ్ల్యూడీ కాలువ భూమిని మాయం చేశారని ఆరోపించారు. కాలువకు, సముద్రానికి మధ్య హై టైడ్ లైన్ పరిధిలో ఉన్న సహజ సిద్ధమైన ఇసుక దిబ్బలు కూడా పూర్తిగా తొలగించి పెద్దమొత్తంలో ఇసుకను తరలించి సమీపంలోని రొయ్యల చెరువులను పూడ్చారని చెప్పారు. దీంతో మత్స్యకారుల వృత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కబ్జాదారులతో కుమ్మక్కయ్యారని ఎద్దేవా చేశారు. ఇంత విధ్వంసం జరుగుతున్నా జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా భూ కబ్జాదారులకు కొమ్ము కాయడం సిగ్గుచేటన్నారు. మండుటెండలో మత్స్యకారులు ఆందోళన చేస్తుంటే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే కనీసం మత్స్యకారులతో మాట్లాడకుండా ఆక్రమణదారులతో మాట్లాడి తిరిగి వెళ్లడంపై మండిపడ్డారు. ఏకంగా సముద్రాన్నే కబ్జా చేస్తుంటే రాష్ట్రంలోని మంత్రులు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరుకు చెందిన ఎమ్మెల్యేకు చెందిన భ్రమరా కంపెనీ ఈ విధమైన ఆక్రమణకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం దేనికి సంకేతమన్నారు. మత్స్యకారులు ఆందోళనతో ఎంతో కొంత కదిలిన జిల్లా అధికార యంత్రాంగం కమిటీల పేరుతో కాలయాపన చేయడం సరైనది కాదని హితవు పలికారు. తక్షణమే ఆక్రమణకు గురైనా ఎల్ ఆకారంలో ఉన్న సీ మౌత్ను పూర్తిగా పునరుద్ధరించాలని కోరారు. కాలువను ఆక్రమించిన వారిపై, ఇసుక దిబ్బలు చదును చేసిన వారిపై, వారికి దొంగ పట్టాలు ఇచ్చి సహకరించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మత్స్యకారులకు అండగా సీపీఎం ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆండ్రా మాలాద్రి, జిల్లా కార్యదర్శి జి.గంగయ్య, నాయకులు ఎన్.బాబూరావు, పి.కొండయ్య, జి.ఏసుబాబు, వాడరేవు మాజీ సర్పంచి ఏరిపిల్లి రమణ, చొక్కా రాంబాబు, పీక్కి డేవిడ్, దోనీ కనకరాజు పాల్గొన్నారు.
సహకరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి డిమాండ్ ఆక్రమణకు గురైన సీమౌత్ను పరిశీలించిన రమాదేవి