
గంగమ్మ తల్లికి వెండి కవచం బహూకరణ
కారంచేడు: గ్రామ దేవతగా విరాజిల్లుతున్న గంగమ్మ తల్లికి భక్తులు 9 కేజీల వెండి కవచం బహూకరించారు. శుక్రవారం మండల కేంద్రమైన కారంచేడు పుట్టాయిపాలెంలో కొలువైన గంగమ్మకి గ్రామానికి చెందిన ఒక భక్తుని కుటుంబం మొత్తం 9 కేజీల వెండితో తయారు చేసిన కవచాన్ని కమిటీ సభ్యులకు అందించింది. వెండి కవచం, కిరీటాన్ని అమ్మవారికి ఆలయ అర్చకులు ఆవుల రాజేష్ ధరింపజేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
సీ మౌత్ అభివృద్ధికి
రూ. 2 కోట్లు
బాపట్ల టౌన్: అడవి పంచాయతీ ఈపూరుపాలెం స్ట్రెయిట్ కట్ కాలువ సిమెంట్ కాంక్రీట్ పనులకు రూ. 2 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి చెప్పారు. శుక్రవారం కాలువను ఆయన పరిశీలించి, మాట్లాడుతూ వివాదానికి కారణమైన భూమిపై కమిటీ ఏర్పాటు చేశామన్నారు. సీ మౌత్ కాలువ వద్ద డ్రెడ్జింగ్ ద్వారా పూడిక వెలికి తీసే పనులు త్వరలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. సీ మౌత్ తీర ప్రాంతంలో జెట్టి నిర్మాణం చేపడతామని తెలిపారు. దీంతో మత్స్యకారులు పడవలు నిలపడానికి సులువుగా ఉంటుందన్నారు. ఆరు నెలల్లో అభివృద్ది పనులు పూర్తి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా, తహసీల్దార్ సలీమా పాల్గొన్నారు.
బాపట్లలో ఆక్రమణల తొలగింపు
బాపట్ల టౌన్: తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న తమ షాపులను ఎందుకు కూల్చుతున్నారంటూ మున్సిపల్ అధికారులను దుకాణ యజమానులు నిలదీశారు. రోడ్డుపైకి షాపులు కట్టి... డ్రైనేజీలను ఆక్రమించిన వారి నిర్మాణాలను వదిలిపెట్టి తమకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. శుక్రవారం పట్ణణంలోని త్రవ్వకాలువ నుంచి చీలురోడ్డు వరకు షాపులను జేసీబీలతో మున్సిపల్ అధికారులు తొలగించే కార్యక్రమం చేపట్టారు. ముందు మున్సిపల్ కాంప్లెక్స్లోని ఆక్రమణలు తొలగించిన తర్వాతే తమ దగ్గరకు రావాలని దుకాణ యజమానులు ఆందోళనకు దిగారు. దీంతో మున్సిపల్ అధికారులు తాత్కాలికంగా తొలగింపు పనులు నిలుపుదల చేశారు.
సుబ్రహ్మణ్యేశ్వరుడికి వెండి నాగపడగ
మోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యే శ్వర స్వామికి దర్శికి చెందిన యారాశి శ్రీకాంత్ రెడ్డి, చంద్రిక కుటుంబ సభ్యులు వెండి నాగపడగను శుక్రవారం సమర్పించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు.. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణకు 550 గ్రాముల బరువున్న సుమారు రూ. 60 వేలతో చేయించిన నాగపడగను స్వామివారి కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు.
నేడు పానకాల స్వామి గుడిలో సహస్ర దీపాలంకరణ
మగళగిరి: మంగళాద్రిలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయం(పానకాల స్వామి)లో శనివారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈవో సునీల్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకోవాలన్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.

గంగమ్మ తల్లికి వెండి కవచం బహూకరణ