
విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి
లక్ష్మీపురం: అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న సుభాష్ అనే విద్యార్థి మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.కిరణ్ తెలిపారు. స్థానిక బ్రాడీపేట ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుకోవాల్సిన విశ్వవిద్యాలయాల్లో వరసగా విద్యార్థులు మృతి చెందుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. విద్యార్థి మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. విద్యార్థుల మృతుల ఘటనలపై కమిటీ చేసి విచారణ చేయాలని ఆయన కోరారు. విద్యార్థులు వరుసగా మరణిస్తున్నా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏమాత్రం స్పందించడం లేదన్నారు. విద్యార్థులకు వచ్చిన మార్కులను మాత్రం ప్రభుత్వం తాము సాధించిన ఘనతగా ప్రచారం చేసుకుంటూ విద్యార్థులు మరణాలకి వారి తమకేమాత్రం సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించి ప్రైవేటు యూనివర్సిటీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు షేక్ సమీర్, నగర కార్యదర్శి ఎ.యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
వర్సిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి..
లక్ష్మీపురం: రాజధాని అమరావతిలో వున్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థి మృతికి కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, సమగ్ర దర్యాప్తు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుందని జిల్లా కార్యదర్శి వై.నేతాజీ తెలిపారు. బ్రాడిపేటలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో వున్న ఎస్ఆర్ఎం వర్సిటీలో యాజమాన్యం వేధింపుల కారణంగా విద్యార్థి మృతిచెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్న నేపధ్యంలో దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. కనీసం చనిపోయిన విషయం తల్లితండ్రులకు సకాలంలో సమాచారం ఇవ్వకపోవడం యాజమాన్యం నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందన్నారు. రాజధాని ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రైవేటు యూనివర్సిటీల్లో ఇటీవల కాలంలో విద్యార్థులు మృతి చెందిన పరిస్థితి ఉందని గుర్తు చేశారు. ఆ సందర్భంలో కూడా ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయకపోవడం వల్ల ఇటువంటివి పునరావృతం అవుతున్నాయన్నారు. సంఘంటనలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీని వేసి సమగ్రంగా దర్యాప్తు చేయాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.
ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా కమిటీ డిమాండ్