రేపల్లె రూరల్: రేపల్లె సబ్జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్బీజీ పార్థసారథి సోమవారం సందర్శించారు. జైలులోని పరిసరాలను, ఖైదీల గదులను, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి ఖైదీలతో మాట్లాడారు. నేరం ఆరోపించబడి ప్రైవేటు న్యాయవాదిని ఏర్పరుచుకోలేని వారి కోసం ప్రభుత్వం ఉచిత న్యాయసేవలు అందించేందుకు ప్రభుత్వ న్యాయవాదిని ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వ న్యాయవాది సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సయ్యద్ జియావుద్దీన్, ప్యానెల్ న్యాయవాది గుమ్మడి కుమార్బాబు, సబ్జైలు సూపరింటెండెంట్ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రుక్మిణీ అలంకారంలో
నృసింహుడు
మంగళగిరి: మంగళాద్రిలోని లక్ష్మీ నృసింహస్వామి సోమవారం రాత్రి రుక్మిణీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆస్థాన అలంకారోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని తరించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో ఏ రామకోటిరెడ్డి ఉత్సవాన్ని పర్యవేక్షించారు. మంగళవారం స్వామి స్థంభోద్భవం అలంకారంలో దర్శనమివ్వనున్నారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 520.60 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 6,041 క్యూసెక్కులు విడుదలవుతోంది.
మత్స్యకారుల
సంక్షేమమే ధ్యేయం
జిల్లా మత్యశాఖ అధికారి సంజీవరావు
విజయపురిసౌత్: మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా మత్స్యశాఖ అధికారి సంజీవరావు అన్నారు. మాచర్ల ఎమ్యెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదేశాలతో మాచర్ల మండలం అనుపు వద్ద కృష్ణా జలాశయంలోకి 10 లక్షల చేప పిల్లలను సోమవారం విడుదల చేశారు. అనంతరం సంజీవరావు మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత వారంలో సైతం 10 లక్షల చేప పిల్లలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అలి వలలుతో చేపల వేట చేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. మత్స్య సంపదను కాపాడుకోవాలని సూచించారు. ఎఫ్డీఓ టీవీఏ శ్రీనివాసరావు, అగ్రికల్చర్ ఏఓ జగదీష్, మత్స్యశాఖ తనిఖీ అధికారి వెంకట రమణ, గ్రామ మత్స్య సహాయకులు లీలావతి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
సబ్జైలును పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి
సబ్జైలును పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి