
సూర్య ఘర్ ముప్త్ బిజ్లీ యోజన లక్ష్యాలను చేరుకోవాలి
బాపట్ల: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముప్త్ బిజ్లీ యోజన పథకం అమలులో స్వయం సహాయక గ్రూపులకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి బ్యాంకర్లకు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బ్యాంకులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్య ఘర్ ముప్త్ బిజ్లీ యోజన పథకం కింద బాపట్ల జిల్లాలో 60 వేల కుటుంబాలకు సోలార్ సిస్టం ఏర్పాటు చేయాలని నిర్దేశించారని తెలిపారు. డిసెంబర్ నాటికి 47 వేల కనెక్షన్లు ఏర్పాటు చేయాలని నిర్దేశించినట్లు తెలిపారు. 2027 నాటికి మొత్తం లక్ష్యాన్ని పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి ఇంటికి 3 కిలోవాట్స్ సోలార్ ప్లేట్లు అమర్చేందుకు నిర్ణయించడమైనదని తెలిపారు. ఈ పథకంకు సంబంధించి ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ మొదలు పెట్టడం జరిగిందన్నారు. దరఖాస్తు దారులు రూ.20 వేలు చెల్లించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు వచ్చిన తరువాత వాటిని తిరస్కరించకుండా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్స్కు సూచించారు. స్వయం సహాయక గ్రూపుల నుంచి లోన్ రికవరీ మొత్తం చెల్లించే బాధ్యత మాదేనని కలెక్టర్ బ్యాంకులకు భరోసా ఇచ్చారు. సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె శ్రీనివాసరావు, ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్ఈ ఆంజనేయులు, ఎల్డీఎం శివకృష్ణ, బ్యాంకు మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.
బ్లాక్ బర్లీ వేగంగా కొనుగోలు చేయాలి
బ్లాక్ బర్లీ పొగాకు పంటను కంపెనీలు వేగంగా కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. సంక్షేమ పథకాల అమలు తీరు, అభివృద్ధి కార్యక్రమాలపై సోమవారం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పొగాకు కొనుగోలులో సమస్య ల పరిష్కారం కోసం పర్చూరులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకురావాలన్నారు. బ్లాక్ బర్లీ పొగాకు సంక్షోభంలో ఉన్నందున ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పొగాకు కొనుగోలుపై ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొగాకు కొనుగోలు తర్వాత పంట నిల్వ చేయడానికి అవసరమైన గోదాములు గుర్తించి, సిద్ధంగా ఉంచాలన్నారు. ధాన్యం సేకరణ వేగం పుంజుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
27నుంచి యోగాంధ్ర కార్యక్రమాలు
ఈనెల 27వ తేదీన బాపట్లలోని భావపురి దేవాలయం ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై జిల్లా స్థాయి యోగా కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. జిల్లా అధికారులు, వారి సిబ్బంది మొత్తం హాజరు కావాలన్నారు. అదే మాదిరిగా ఈనెల 31వ తేదీన సూర్యలంక సమీపంలోని అటవీ శాఖ నగర వనంలో భారీ స్థాయిలో యోగాసనాల కార్యక్రమం జరపాలన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా లబ్ధిదారులకు నేరుగా నగదు పంపిణీ చేసే కార్యక్రమంపై మాట్లాడారు. జూన్ 22వ తేదీ తర్వాత గ్రామీణ ప్రాంతాలలోని రహదారుల వెంట చెత్త కనిపించరాదన్నారు. ప్లాస్టిక్ విక్రయా లు, వినియోగంపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలన్నారు. డీఆర్వో జి గంగాధర్గౌడ్, ఉప కలెక్టర్ లవన్న, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.