ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి | - | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి

Mar 24 2025 2:34 AM | Updated on Mar 24 2025 2:33 AM

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు పలు అర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన రద్దీ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు కొనసాగింది. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఘాట్‌రోడ్డు, మహా మండపం లిప్టు, మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్నారు. రూ. 500, రూ.300, రూ.100 టికెట్‌తోపాటు సర్వ దర్శనం క్యూలైన్‌లో భక్తుల రద్దీ కనిపించింది. సర్వ దర్శనానికి రెండు గంటలకుపైగా సమయం పట్టింది.

అర్జిత సేవల్లో ఉభయదాతలు

తెల్లవారుజామున ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్‌ వద్ద నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీచక్రనవార్చన, లక్ష కుంకు మార్చన, యాగశాలలో నిర్వహించిన చండీ హోమం, శాంతి కల్యాణంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఆర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలను ప్రత్యేక క్యూలైనులో అమ్మవారి దర్శనానికి అనుమతించారు. రూ. 500 టికెటు కొనుగోలు చేసిన భక్తులతోపాటు వీఐపీలు, సిఫార్సు లేఖలపై వచ్చిన భక్తులకు అంతరాలయ దర్శనం కల్పించారు. అంతరాలయానికి రద్దీ తగ్గుముఖం పట్టిన కొంత సమయం తర్వాత రూ.300 క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులకు ముఖ మండప దర్శనానికి అనుమతించారు. భక్తులకు అమ్మవారి బంగారు వాకిలి దర్శనం కల్పించడంతో త్వరతిగతిన దర్శన భాగ్యం కలిగింది.

ఇబ్బంది కలుగకుండా చర్యలు

రద్దీ ఎక్కువైన నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏఈవో చంద్రశేఖర్‌ సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. భక్తులకు మంచినీటిని సరఫరా చేయించారు. అన్న ప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం అమ్మవారి పంచ హారతుల సేవ, పల్లకీ సేవలోనూ భక్తులు, ఉభయదాతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement