ఆదాయం పెంచేలా ప్రణాళికలు | - | Sakshi
Sakshi News home page

ఆదాయం పెంచేలా ప్రణాళికలు

Mar 23 2025 8:51 AM | Updated on Mar 23 2025 8:50 AM

బాపట్ల: వ్యవసాయం, మత్స్య, ఆక్వా ఉత్పత్తులను పెంచడం ద్వారా ఆదాయం వృద్ధికి అధికారులు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి తెలిపారు. వివిధ శాఖల అధికారులతో శనివారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు 10.70 శాతం లక్ష్యంతో చర్యలు తీసుకోవాలని చెప్పారు. సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 28,184 హెక్టార్లలో సేంద్రియ సాగు చేశామన్నారు. ఏడు శాతం ఉత్పత్తి పెరిగేలా 30,998 హెక్టార్లు లక్ష్యంగా ముందుకు వెళ్లాలన్నారు. తద్వారా జిల్లాకు రూ.4,943 కోట్లు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. మత్స్య, ఆక్వా రంగాల ద్వారా ఏడాదిలో రూ.12,440 కోట్లు ఆదాయం లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని, 13.41 వృద్ధిరేటు సాధించాలన్నారు.

పర్యాటకంపై దృష్టి పెట్టండి

అతి తక్కువ నిధులతో ఆరు బీచ్‌లను అభివృద్ధి చేయడం ద్వారా ఏడాదికి రూ.535 కోట్లు ఆదాయం లక్ష్యంగా ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. పర్యాటకంలో 18.88 వృద్ధి రేటు ఉంటుందన్నారు. అటవీ సంపద వృద్ధి చేయాలని సూచించారు. ఉద్యాన పంటలు అదనంగా 1,650 హెక్టార్లకు విస్తరించాలని తెలిపారు. విస్తీర్ణం పెరుగుదలతో ఉత్పత్తులు అధికం అవుతాయని.. తద్వారా రూ.4,065 కోట్ల ఆదాయం జిల్లాకు వస్తుందన్నారు. 11.49 శాతం వృద్ధిరేటు సాధన దిశగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. మూడు వేల హెక్టార్లలో సూక్ష్మ, బిందు సేద్యం సాగయ్యేలా రైతులను చైతన్య పరచాలన్నారు. రానున్న ఏడాదిలో 20% వృద్ధిరేటు సాధన దిశగా అధికారులు అడుగులు వేయాలని పేర్కొన్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా సంప్రదాయ పద్ధతిలో 54,654 గేదెలు, ఆవులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. కృత్రిమ పద్ధతిలో 49,675 గేదెలను ఉత్పత్తి చేయాలన్నారు. దీంతో పాల దిగుబడి మరింత పెరిగి ఆదాయం రూ.6,630 కోట్లకు చేరే లక్ష్యంతో 15.20 శాతం వృద్ధిరేటుగా ప్రణాళికలు రూపొందించాలన్నారు.

పరిశ్రమల విస్తరణ కీలకం

గ్రానైట్‌, ఇసుక, కంకర వనరులతో రూ.110 కోట్ల ఆదాయం లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల విస్తరణతో వార్షికాదాయం రూ.1,941 కోట్లకు పెరిగేలా చూడాలన్నారు. తద్వారా 37.51% వృద్ధిరేటు పెరుగుతుందన్నారు. ప్రస్తుతం జిల్లాలో రైల్వే లైన్‌ ద్వారా రూ.109 కోట్ల ఆదాయం వస్తోందన్నారు. తాజాగా రైల్వే గూడ్స్‌ రేక్‌ వంటి తదితర వనరులతో ఏడాదిలో వృద్ధిరేటు 5.83% పెరగనుందన్నారు. గ్రామీణ నీటి సరఫరా మరింత పెంచడానికి రూ.167 కోట్లు పనులు చేయాలని ఆయన తెలిపారు. ప్రజా ప్రయోజనం కోసం పైప్‌ లైన్ల నిర్మాణం పెంచాలన్నారు. విద్యుత్‌ శాఖ ద్వారా రూ.731 కోట్లు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రచించాలన్నారు. ప్రస్తుతం రూ.17.91 కోట్లతో సబ్‌ స్టేషన్‌ నిర్మాణాలు లక్ష్యంగా పనులు చేపడుతామన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి సూచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement