పచ్చ నేతల బియ్యం మేత! | - | Sakshi
Sakshi News home page

పచ్చ నేతల బియ్యం మేత!

Mar 23 2025 8:51 AM | Updated on Mar 23 2025 8:50 AM

సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున చౌకబియ్యం గుజరాత్‌కు తరలిపోతోంది. బాపట్ల శివారులోని అప్పికట్లకు చెందిన ఒక వ్యాపారి బాపట్ల, పొన్నూరు ప్రాంతాల నుంచి రేషన్‌ బియ్యం సేకరిస్తున్నాడు. ప్రతినెలా 25 వేల క్వింటాళ్ల వరకు సేకరించి రైస్‌ మిల్లులో రీసైక్లింగ్‌ చేసి ప్యాక్‌ చేస్తున్నాడు. అనంతరం బియ్యాన్ని గుంటూరు తరలించి, అక్కడి నుంచి గుజరాత్‌కు అక్రమ రవాణా చేస్తున్నాడు. ఇందుకోసం పౌరసరఫరాల శాఖ, పోలీసు శాఖ అధికారులకు ప్రతి నెల మామూళ్లు ముట్టజెబుతున్నాడు. బాపట్ల పచ్చ పార్టీ ముఖ్య నేత అనుచరుడిగా ఉన్న సదరు మిల్లర్‌.. యజమాని పచ్చ నేతకు నెలకు రూ. 15 లక్షల వరకు కప్పం చెల్లిస్తున్నట్లు ప్రచారం ఉంది. ఇదే నియోజకవర్గం నుంచి మరో ఇద్దరు వ్యాపారులు సైతం ఈ దందా సాగిస్తున్నట్లు సమాచారం. వీరు కూడా పచ్చనేతకు రూ. 10 లక్షల – రూ.15 లక్షల వరకు కప్పం చెల్లిస్తున్నట్లు పచ్చ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అధికారంలోకి రాగానే బరితెగింపు...

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో పేదలకు ఇవ్వాల్సిన రేషన్‌ బియ్యాన్ని పచ్చనేతలు అక్రమంగా తరలించి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. జిల్లాలోని బాపట్ల, పర్చూరు, అద్దంకి, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల పరిధిలోని వారి అనుచరులు ఈ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. వీరంతా బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల పచ్చనేతల అండతో డీలర్ల నుంచి చౌక బియ్యాన్ని సేకరిస్తున్నారు. కార్డుదారులకు కిలో రూ. 12 చొప్పున ఇచ్చి కొంటున్న మాఫియా అదే బియ్యాన్ని రూ. 35 నుంచి రూ.40కు అమ్మకం సాగిస్తున్నట్లు సమాచారం. చాలా నియోజకవర్గాల్లో కార్డుదారులకు పైసా ఇవ్వకుండా కొందరు పౌరసరఫరాల శాఖ అధికారుల సహకారంతో స్టాకు పాయింట్ల నుంచే బియ్యాన్ని లిప్టు చేస్తున్నారు. బియ్యం అప్పగించినందుకు నియోజకవర్గ పచ్చనేతకు రూ. 25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు మామూళ్లు ముట్టజెబుతున్నారు. బియ్యం ప్రస్తావన తెస్తే కార్డులు రద్దు చేస్తామని పచ్చనేతలు బెదిరింపులకు దిగుతుండడంతో చాలామంది పేదలు బియ్యం అందక పోయినా నోరు మెదపడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఈ బెదిరింపుల పర్వం కొనసాగుతోంది.

పట్టించుకోని అధికారులు

బాపట్ల జిల్లాలోని రేపల్లె, వేమూరు, బాపట్ల ప్రాంతాల్లో సేకరించిన బియ్యాన్ని స్మగ్లర్లు గుజరాత్‌కు తరలిస్తున్నారు. చీరాల, పర్చూరు, అద్దంకి, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో సేకరించిన బియ్యాన్ని కృష్ణపట్నం పోర్టుకు చేరుస్తున్నారు. అక్కడి నుంచి సౌతాఫ్రికాకు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ దందాను అడ్డుకోవాల్సిన అధికారులు నెల మామూళ్లకు పరిమితమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పేదలకు అందాల్సిన చౌక బియ్యం పచ్చ నేతల పరం అవుతున్నాయి. ప్రతి నెల ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ బియ్యాన్ని డీలర్లు స్థానిక పచ్చ నేతలు నియమించుకున్న అక్రమ రవాణాదారులకు అప్పగిస్తున్నారు. వాటిని వ్యాపారులు రైస్‌ మిల్లుల్లో రీసైక్లింగ్‌ చేసి గుజరాత్‌కు తరలిస్తున్నారు. ఇందుకుగాను నియోజకవర్గ పచ్చ నేతకు రూ. 25 లక్షలకు తగ్గకుండా కప్పం చెల్లిస్తున్నారు.

రేషన్‌ బియ్యం దందాతో అక్రమార్జన

అప్పికట్ల నుంచి గుజరాత్‌కు రవాణా

బాపట్ల, పొన్నూరు నుంచి సేకరణ

అప్పికట్ల మిల్లులో రీసైక్లింగ్‌

చేసి తరలింపు

బాపట్ల పచ్చ నేతకు నెలకు

రూ. 25 లక్షలు కప్పం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement