బాపట్ల: ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఏపీ రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు కమిషనర్, జిల్లా ప్రత్యేక అధికారి కృతికా శుక్లా తెలిపారు. బాపట్ల పట్టణంలోని బాపట్ల జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని ఆమె శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల తీరు, పరీక్ష కేంద్రంలో వనరులను ఆమె పరిశీలించారు. ఇంటర్మీ డియెట్ పరీక్షలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యంత్రాంగం పకడ్బందీగా చర్యలు తీసుకుందని చెప్పారు. బాపట్లలోని అన్ని కేంద్రాలలో ప్రశాంతంగా పరీక్షలు జరిగాయన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా యంత్రాంగం చర్యలు తీసుకుందన్నారు. జిల్లాలో 36 పరీక్ష కేంద్రాలలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరిగాయని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ప్రత్యేక అధికారికి వివరించారు. 7,979 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయాల్సి ఉండగా 7,710 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. మిగిలిన 269 మంది గైర్హాజరైనట్లు జిల్లా కలెక్టర్ జిల్లా ప్రత్యేక అధికారి దృష్టికి తెచ్చారు. వారి వెంట జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, కళాశాల ప్రధానాచార్యులు జి కోటేశ్వరరావు, పరీక్ష కేంద్రం సీఎస్ టి.భవాని, తదితరులు ఉన్నారు.
ఏపీ రాష్ట్ర ఇంటర్మీడియెట్
బోర్డు కమిషనర్ కృతికా శుక్లా