మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు

Mar 15 2025 1:51 AM | Updated on Mar 15 2025 1:50 AM

రశీదుతోనే న్యాయం

బాపట్లటౌన్‌: రోజురోజుకు పెరుగుతున్న ధరలు... కల్తీ సరుకులు...తూకల్లోనూ మోసాలు...ఇదీ ప్రస్తుత పరిస్థితి. వీటి నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ వినియోగదారుల హక్కుల గురించి అవగాహన కలిగి ఉండాలి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1962 మార్చి 15న అమెరికా సెనేట్‌ వినియోగదారులకు నాలుగు హక్కులను ప్రసాదించింది. 1973 మార్చి 15 నుంచి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మన దేశంలో 1986 డిసెంబర్‌ 24 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ రోజునే జాతీయ వినియోగదారుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

వినియోగదారుల హక్కులు ఇలా..

నాణ్యమైన సరుకులు సరసమైన ధరలకు పొందడంతోపాటు వినియోగదారుల ప్రయోజనాన్ని కాపాడేందుకు చట్టరీత్యా వినియోగదారులకు కొన్ని హక్కులు కల్పించారు. ఈ హక్కులను ఉపయోగించి అమ్మకందారులు ఏవైనా నాసిరకం వస్తువులను అమ్మిన సందర్భాల్లో సరైన ఫోరమ్‌ను ఆశ్రయించి న్యాయం పొందవచ్చు. మోసపూరితమైన వ్యాపారుల వలన నష్టపోతే పరిహారం కోరవచ్చు. వస్తువులపై పూర్తిస్థాయిలో అవగాహన పొందవచ్చు. సేవల్లో ఏవైనా లోపాలు జరిగితే బ్యాంకింగ్‌, వైద్యరంగం, విద్యుత్‌, రావాణా, బీమా తదితర సంస్థలపై కేసులు కూడా వేసే వెసులుబాటు వినియోగదారులకు ఉంటుంది.

హెల్ప్‌లైన్‌ సేవలు ఇలా ..

వస్తువుల కొనుగోలు, సేవల విషయంలో మోసం, ఆంక్షలపై వినియోగదారుల కమిషన్లను ఆశ్రయించవచ్చు. చాలా మందికి వీటిపై సరైన అవగాహన లేకపోవడంతో నష్టపోతున్నారు. ఒకవేళ అవగాహన ఉన్నప్పటికీ కోర్టుల చుట్టూ ఏం తిరుగుతాం, తీర్పు ఎప్పటికి వస్తుందోనన్న నిరాశతో చాలామంది వినియోగదారులు మిన్నకుండిపోతున్నారు. జాతీయ వినియోగదారు హెల్ప్‌లైన్‌ నంబర్‌ (1916) ఒకటి ఉందని ఇప్పటికీ చాలా మందికి తెలియదు. వినియోగదారులకు మేలైన ప్రయోజనాలు కల్పించేందుకు 1986లోనే చట్టాన్ని ఏర్పాటు చేశారు. ఈ చట్టాన్ని 1993, 2002, 2019లో పలు విధాలుగా సవరించారు.అప్పటినుంచి కేంద్రం నుంచి జిల్లాస్థాయి వరకు వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కమిషన్లు పనిచేస్తున్నాయి. అక్రమ వ్యాపార లావాదేవీల విధానాల విషయంలో కొనుగోలుదారులకు ఈ చట్టం భద్రత కల్పిస్తుంది. ఫిర్యాదు చేసిన 30 రోజుల్లో సమస్యను పరిష్కరించాలని ఈ చట్టం సూచిస్తోంది.

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

బాపట్ల జిల్లాగా రూపాంతరం చెందిన తర్వాత విచ్చలవిడిగా వెలుస్తున్న దుకాణాలు, మాల్స్‌, సూపర్‌ మార్కెట్‌, కిరాణా దుకాణాల యజమానులు తూనికలు, కొలతల్లో భారీగా వ్యత్యాసాలు ఉన్నప్పటికీ అధికారులు మొక్కుబడిగా తనిఖీలు నిర్వహిస్తున్నారే కానీ వాటిని పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయటంలో విఫలమవుతున్నారు. వ్యాపారస్తులు ప్యాకింగ్‌ లైసెన్స్‌లు పొందకుండానే ఇష్టమొచ్చిన రీతిలో ప్యాకింగ్‌ చేసి వస్తువులను విక్రయిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వ్యాపారస్తులు మోసాలకు పాల్పడుతున్నారని వినియోగదారులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.

ఓ దుకాణంలో నూనె శాంపిల్స్‌ సేకరిస్తున్న అధికారులు(ఫైల్‌)

బాపట్ల పట్టణానికి చెందిన సరస్వతి మార్కెట్‌ కు వెళ్లింది. అక్కడ పలు వస్తువులు కొనుగోలు చేసి ఇంటికి వచ్చింది. కందిపప్పు ప్యాకెట్‌ తూకం సక్రమంగా లేనట్లు గుర్తించింది. మళ్లీ మార్కెట్‌కు వెళితే.. దుకాణదారుడు ఆమెనే ఎదురు ప్రశ్నించాడు. దీంతో గొడవెందుకు అనుకుని ఇంటికి వచ్చింది. ఇది ఒక్క సరస్వతి సమస్యే కాదు.. ప్రతి వస్తువూ కొనుగోలు చేసే వినియోగదారుడిది! కొనుగోలు చేస్తున్న వస్తువు క్వాలిటీతోపాటు క్వాంటిటీ ఉందా లేదా అనే అంశాలను గుర్తించడంతో వినియోగదారుల అలసత్వమే దీనికి ప్రధాన కారణం. కేజీ సరుకు కొనుగోలు చేస్తే అందులో 50 గ్రాములు తగ్గినంత మాత్రాన ఏమి అడుగుతాములే! అనే ధోరణిలో ఉన్నారు. కానీ ఇలాంటి వారందరి చేతిలో బ్రహ్మాస్త్రంగా వినియోగదారుల ఫోరం పనిచేస్తోంది. ఇది కొనుగోలుదారుల గొంతుకై వ్యాపారుల మోసాలను నిలదీస్తుంది. వినియోగదారులకు అండగా ఉంటుంది. శుక్రవారం కొన్ని దుకాణాల వద్దకు సాక్షి పరిశీలనకు వెళ్లగా.. అక్కడ తూకాల్లో జరుగుతున్న మోసాలు వెలుగు చూశాయి.

వినియోగదారులు ఏ వస్తువులు కొనుగోలు చేసినా తప్పనిసరిగా రశీదు పొందాలి. వ్యాపారస్తులు, వ్యాపార సముదాయాలపై ఫిర్యాదు చేయాంటే రుజువు తప్పనిసరిగా అవసరం అవుతుందనే విషయాన్ని వినియోగదారులు గ్రహించాలి. వస్తువులను కొనుగోలుచేసే సమయంలో నికర తూకం, వస్తువు నాణ్యతా ప్రమాణాలు చూసుకొని కొనుగోలు చేయాలి. అనుచిత వ్యాపార పద్ధతులను అవలంభించరాదు. వినియోగదారుల హక్కులతోపాటు బాధ్యతలను గుర్తించుకోవాలి. సరైన ఆధారాలతో ఫిర్యాదుచేస్తే కేసు 90 రోజుల్లోనే పరిష్కారం అవుతుంది.

–డాక్టర్‌ పీసీ సాయిబాబు,

జిల్లా వినియోగదారుల పరిరక్షణ

మండలి సభ్యులు

వ్యాపారస్తులు, వ్యాపార సముదాయాల నిర్వాహకులు మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లా వ్యాప్తంగా అన్నిరకాల దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. తూనికలు, కొలతల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించిన దుకాణాలను సీజ్‌ చేయటంతోపాటు అపరాధ రుసుం విధిస్తున్నాం. ఎవరైనా వినియోగదారుడు నష్టపోతే తమకు ఫిర్యాదు చేస్తే సంబందిత వ్యాపారస్తులపై చర్యలు తీసుకుంటాం.

–రామదాసు, తూనికల కొలతల అధికారి, బాపట్ల

మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు 1
1/5

మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు

మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు 2
2/5

మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు

మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు 3
3/5

మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు

మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు 4
4/5

మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు

మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు 5
5/5

మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement