భట్టిప్రోలు: హరహర మహాదేవ..శంభో శంకర...అంటూ భక్తులు తన్మయత్వంతో శివనామస్మరణ చేస్తుంటే భట్టిప్రోలులో గురువారం భ్రమరాంబ మల్లేశ్వరస్వామి రథం ముందుకు కదిలింది. తండోప తండాలుగా తరలి వచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారి రఽథాన్ని ఉత్సాహంగా లాగుతుంటే భక్తులు మిద్దెలు, గోడలు ఎక్కి ఆ సుందర దృశ్యాన్ని తిలకించారు. పురవీధులన్నీ జనంతో నిండిపోయాయి. స్వామి వారి కల్యాణ మహోత్సవాలే భట్టిప్రోలు తిరునాళ్లగా ప్రసిద్ధి గాంచాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలలో కీలక ఘట్టమైన రథోత్సవం సాయంత్రం నేత్ర పర్వంగా కొనసాగింది. రథోత్సవానికి ముందు యాజ్ఞీకులు కౌతా సత్య వెంకట నాగరాజేష్ శర్మ హోమం నిర్వహించారు. పూజా కార్యక్రమంలో తిరువీధుల నాని నాగార్జున–రోజ దంపతులు పాల్గొన్నారు. రథం దేవాలయం వద్ద నుంచి బయలు దేరి పురవీధుల గుండా స్వామి వారి అత్తవారి ఇల్లు అయిన అద్దేపల్లి అమ్మవారి చెట్టు వద్ద కు వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకుంది. రథంపై పూలతో అలంకరించిన స్వామి వారిని చూసి భక్తులు పులకించి పోయారు.
తిరునాళ్ల సందర్భంగా ప్రత్యేక చర్యలు
తిరునాళ్ల సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపల్లె డీఎస్పీ ఆధ్వర్యంలో వేమూరు సీఐ ఆంజనేయులు, భట్టిప్రోలు ఎస్ఐ ఎం.శివయ్య పర్యవేక్షణలో వేమూరు, చుండూరు, సర్కిల్ పరిధిలోని ఏడుగురు ఎస్ఐలు, స్పెషల్ పార్టీ సిబ్బంది 100 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమాలను వంశపారంపర్య ధర్మకర్తలు అద్దేపల్లి–భట్టిప్రోలు పద్మశాలీయ బహుత్తమ సంఘీయులు, దేవాలయ కార్యనిర్వాహణాధికారి రేపల్లె ఇన్స్పెక్టర్ శనగవరపు కుమార్బాబు పర్యవేక్షించారు.
భట్టిప్రోలు పురవీధులలో ఊరేగిన భ్రమరాంబ మల్లేశ్వరస్వామి తరలివచ్చిన భక్తులు