చీరాల టౌన్: చీరాలకు హార్బర్ అందని ద్రాక్షలా మారకుండా ఉండాలంటే వాడరేవులోనే పూర్తిస్థాయిలో నిర్మాణం చేయాల్సిందేనని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.రమాదేవి డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని వాడరేవు గ్రామంలోని ఫిష్ ల్యాండ్ సెంటర్ వద్ద సీపీఎం వాడరేవు కార్యదర్శి ఎన్.బాబూరావు ఆధ్వర్యంలో గ్రామ మాజీ సర్పంచ్ ఎరిపిల్లి రమణ అధ్యక్షతన మత్స్యకారులతో సమావేశాన్ని నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ చీరాలకు తలమానికమై వాడరేవులో నిర్మిస్తున్న హార్బర్ వ్యయాన్ని తగ్గిస్తున్నట్లు ప్రయత్నాలు చేయడం చీరాల ప్రజలతోపాటు మత్స్యకారులను తీవ్రంగా మోసం చేసినట్లేనన్నారు. హార్బర్ నిర్మాణానికి రూ.450 కోట్లు కేటాయించి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. మత్స్యకారుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూడటం దుర్మార్గమన్నారు. గతేడాది ఇవ్వాల్సిన మత్స్యకరా భరోసా సాయాన్ని నేటికీ అందించకుండా పాలకులకు గంగపుత్రులను నట్టేట ముంచారన్నారు. మత్స్యకారులకు రుణాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని మండిపడ్డారు. హార్బర్ ఏర్పాటుతో చీరాల రూపురేఖలు మారడంతోపాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. మత్స్యసంపద నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజీలు నిర్మాణం చేయడంతో పాటుగా గిట్టుబాటు ధరలు వస్తాయన్నారు. హార్బర్ అనుసంధానంగా పలురకాల వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు కలిగి తీరప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. ఓ వైపు వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారి నిర్మాణం పనులు జరుగుతున్నాయని, ఈ రహదారి వినియోగంలోకి వస్తే చీరాల పర్యాటకంగా దూసుకెళ్తుందని, అలానే హార్బర్ పనులు కూడా వేగంగా చేస్తే చీరాల, వాడరేవు రూపురేఖలు మారుతాయన్నారు. హార్బర్ వ్యయాన్ని తగ్గించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 9 హార్బర్ పనులను ప్రభుత్వమే పూర్తి చేయాలన్నారు. సముద్రంలో వేట చేస్తూ మరణించిన, గల్లంతైన వారికి మరణ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా కాలయాపన చేయడం మత్య్సకారులను నయవంచనకు గురించేయడమేనన్నారు. మత్స్యకార సంఘాల నాయకులు కనకరాజు, ఏసు, అంజని, సత్తిబాబు, గాలి, శ్రీను, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్రకార్యవర్గ సభ్యులు రమాదేవి