కత్తితో చేయి కోసుకుని యువకుడు ఆత్మహత్య
కనిగిరిరూరల్: ప్రియురాలితో పెళ్లి కోసం కత్తితో చేయి కోసుకుని ఓ యువకుడు ప్రాణం తీసుకున్నాడు. ఈ సంఘటన గురువారం రాత్రి కనిగిరిలో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన రవితేజకు కనిగిరికి ఇందిరాకాలనీకి చెందిన పుట్టా లక్ష్మీదేవితో పరిచయం ఏర్పడింది. లక్ష్మీ భర్త ఐదేళ్ల క్రితం చనిపోయాడు. కొద్ది రోజులుగా లక్ష్మీని పెళ్లి చేసుకుంటానని రవితేజ గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన రవితేజ మద్యం తాగి ప్రభుత్వాసుపత్రి సమీపంలో కత్తితో చేయి కోసుకున్నాడు. అధిక రక్తస్రావంతో రవితేజ మరణించినట్లు పోలీసులు తెలిపారు. వీఆర్ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి.శ్రీరాం పేర్కొన్నారు.
కిడ్నీ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
కిడ్నీ డే సందర్భంగా ఎయిమ్స్లో వాక్థాన్
మంగళగిరి: కిడ్నీ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఆల్ ఇండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఎయిమ్స్) డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ అహెంతమ్ శాంతా సింగ్ తెలిపారు. అంతర్జాతీయ కిడ్నీ డే సందర్భంగా గురువారం ఉదయం ఎయిమ్స్లో వైద్యులు, మెడికల్ విద్యార్థులతో వాక్థాన్ నిర్వహించారు. డైరెక్టర్ శాంతాసింగ్ మాట్లాడుతూ కిడ్నీ అనారోగ్యం బారిన పడితే ఆ ప్రభావం శరీరంలోని ప్రతి అవయంపైనా పడుతుందన్నారు. కిడ్నీలను కాపాడుకోవడంలో అప్రమత్తంగా ఉంటే ఆరోగ్యంగా జీవించవచ్చని పేర్కొన్నారు. నేటి ఆధునిక సమాజంలో కిడ్నీల విక్రయాలు జరగడం దారుణమన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ శ్రీమంత కుమార్ దాస్, డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ హెచ్వోడి డాక్టర్ ఉత్తర దాస్, మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు.
తెనాలిలో ముగిసిన ప్రత్యేక సదరం క్యాంప్
తెనాలిఅర్బన్: వికలాంగుల ధ్రువపత్రాలను పునఃపరిశీలన జరిపే కార్యక్రమంలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక సదరం క్యాంప్ గురువారంతో ముగిసింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సదరం క్యాంప్ను అధికారులు నిర్వహించారు. ఈఎన్టీ, అఫ్తమాలజీ, ఆర్ధోపెడిక్, సైక్రాటిక్ విభాగాలకు చెందిన వికలాంగులకు వైద్య పరీక్షలు చేశారు. క్యాంప్లో పలు ప్రభుత్వ వైద్యశాలకు చెందిన వైద్యులు పరీక్ష లు నిర్వహించారు. వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి పర్యవేక్షించారు.
మిర్చిని ఆరబెట్టుకుని
తీసుకురావాలి
మిర్చి యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి సీజన్ ఊపందుకుందని, రోజుకు 1.50 లక్షల నుంచి 1.80 లక్షల మిర్చి బస్తాలు యార్డుకు వస్తున్నాయని యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యార్డుకు రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి రైతులు ఎండు మిర్చిని తీసుకువచ్చి గిట్టుబాటు ధర పొందుతున్నారని వెల్లడించారు. గత ఐదు రోజులుగా వస్తున్న మిర్చి సరుకులో తేమ శాతం అధికంగా ఉండటంతోపాటు, దుమ్ము, ధూళి ఉండటం వల్ల దాని ప్రభావం ధరలపై పడుతోందని తెలిపారు. రైతులు కల్లాల్లోనే మిర్చిని ఆరబెట్టడంతోపాటు దుమ్ము, ధూళి లేకుండా గ్రేడింగ్ చేసుకొని తీసుకువచ్చి మంచి ధర పొందాలని ఆమె రైతులకు విజ్ఞప్తి చేశారు.
ప్రియురాలితో పెళ్లి కోసం..