జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
బాపట్ల: ప్రభుత్వ ఉద్యోగుల సంస్థాగత నిర్మాణం, నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక శిక్షణలు ఇస్తున్నామని కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐజీఓటీ కర్మయోగి డిజిటల్ శిక్షణ తరగతులు స్థానిక కలెక్టరేట్ ఆవరణలో బుధవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఐజీఓటీ కర్మయోగి వెబ్ పోర్టల్ నుంచి ఆన్లైన్ ద్వారా ప్రభుత్వం డిజిటల్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రథమంగా అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. మారుతున్న కాలానుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులు నవీకరణ పొందడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎఫ్ఎంఎస్ఐడీ ఉన్న ప్రతి ఉద్యోగికి శిక్షణ అవసరమని, ఈనెల 20వ తేదీలోగా వెబ్ పోర్టల్ నుంచి ఆన్లైన్ ద్వారా డిజిటల్ శిక్షణ పొందాలని ఆదేశించారు. శిక్షణ అనంతరం ఆన్లైన్లో వచ్చే ప్రశ్నావళికి సరైన సమాధానాలు ఇవ్వాలని తెలిపారు. ఉద్యోగుల నైపుణ్యాలకు మెరుగులు పెట్టడానికే 856 శిక్షణ కోర్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఉద్యోగులంతా సద్వినియోగం చేసుకునేలా అధికారులు క్షేత్రస్థాయిలో శిక్షణలు ఇవ్వాలని కలెక్టర్ వివరించారు. జిల్లా ప్రణాళిక అధికారి కె. శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి వారం శిక్షణ తరగతులు ఆన్లైన్లో నవీకరణ పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. అధికారులు ఈ విషయాన్ని గుర్తించి ఉద్యోగులందరికీ అవగాహన కల్పించాలని చెప్పారు. సందేహాలకు ఎస్. హరినాథ్ (96521 71785), వి. సృజన (90634 94729) సంప్రదించవచ్చని సూచించారు. ఎంపీడీవోలు తమ పరిధిలోని ఉద్యోగులందరికీ శిక్షణలు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ప్రణాళికా శాఖ ఏపీఎస్డీపీఎస్ అధికారి జ్ఞానం, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.