శిలా ఫలకాలు తొలగించడం సరికాదు ! | - | Sakshi
Sakshi News home page

శిలా ఫలకాలు తొలగించడం సరికాదు !

Mar 13 2025 11:53 AM | Updated on Mar 13 2025 11:50 AM

మాజీ డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి

బాపట్ల టౌన్‌: సాక్షాత్తు కలెక్టర్‌ కార్యాలయంలోని శిలా ఫలకాలకే రక్షణ లేకపోతే మారుమూల ప్రాంతాల పరిస్థితి ఇంకెలా ఉంటుందో ? అంటూ మాజీ డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత పోరులో భాగంగా బుధవారం కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల సౌకర్యార్థం బాపట్లను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా కలెక్టర్‌ కార్యాలయం, జిల్లాలోని వివిధ శాఖల అధికారుల కార్యాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకు సుపరిపాలన అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని తెలిపారు. నాడు ఎంతో పండుగ వాతావరణంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. నేడు అక్కడ గత ప్రభుత్వ అనవాళ్లు కూడా చేయాలనే దురుద్దేశంతో శిలాఫలకాలు తొలగించడం ఎంతవరకు సమంజసమో అధికారులే సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఈ దుస్థితి ఉంటే, జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఇంకెంత దారుణంగా ఉంటుందో ఇట్టే అర్థమవుతుందని తెలిపారు. కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా శిలాఫలకాలను ఇష్టమొచ్చినట్లు జిల్లావ్యాప్తంగా ధ్వంసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికే చాలాచోట్ల తొలగించారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించి రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. శిలాఫలకాల తొలగింపుపై పూర్తిస్థాయిలో విచారణ చేసి, వాటిని యథాస్థానంలో నిర్మించాలని, లేనిపక్షంలో అధికారుల తీరును న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి పోరాటం చేస్తామని రఘుపతి హెచ్చరించారు.

ప్రజల గుండెల్లో

వైఎస్సార్‌ సీపీకి సుస్థిర స్థానం

బాపట్ల: ప్రజల గుండెల్లో నిండిన పార్టీ వైఎస్సార్‌ సీపీ మాత్రమేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో భారీ కేక్‌ కట్‌ చేశారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. కష్టపడిన ప్రతి ఒక్కరికీ మంచి భవిష్యత్‌ ఉంటుందని చెప్పారు. వైఎస్సార్‌ సీపీ బాపట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి మాట్లాడుతూ ప్రజారంజక పాలన అందించిన వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునే వరకు ప్రతి ఒక్కరం కష్టపడి పని చేద్దామని పిలుపునిచ్చారు. అబద్ధాల మాటలు నమ్మి కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు వేశారన్నారు. ఎందుకు ఇంత పెద్ద తప్పు చేశామని ఇప్పుడు బాధపడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలకు సూపర్‌సిక్స్‌ పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని నిలదీద్దామని కోన పిలుపునిచ్చారు. ఆశపడి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేసిన చంద్రబాబు సర్కారుకు సరైన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో రేపల్లె ఇన్‌చార్జి ఈవూరి గణేష్‌, చీరాల ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌బాబు, పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, మరుప్రోలు కొండలరెడ్డి, ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి, కోకి రాఘవరెడ్డి, వడ్డిముక్కల డేవిడ్‌, గవిని కృష్ణమూర్తి, దొంతిబోయిన సీతారామిరెడ్డి, సోహిత్‌, గంగిశెట్టి రత్తయ్య, కటికల యోహోషువా, జోగి రాజా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement