
సముద్రంలోకి వదిలి పెడుతున్న రేంజ్ ఆఫీసర్ జాన్సన్
చినగంజాం: సముద్ర తాబేళ్లు అంతరించి పోకుండా సంరక్షించుకోవాల్సిన అవసరం మనపై ఉందని చీరాల రేంజ్ బాపట్ల డివిజన్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వై జాన్సన్ అన్నారు. గురువారం ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ, సోషల్ ట్రీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కుంకుడుచెట్లపాలెం సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన సముద్ర తాబేళ్ల సంతతి సంరక్షణ కేంద్రం నుంచి 90 ఆలీవ్ రెడ్లీ పిల్లలను సముద్రంలోకి సురక్షితంగా వదలి పెట్టారు. ఆయన మాట్లాడుతూ ఈ సముద్ర తాబేళ్ల సంతతి సంరక్షణ కేంద్రంలో మొత్తం 16 తల్లి తాబేళ్లు నుంచి 1617 గుడ్లు సేకరించి వాటి నుంచి 390 పిల్లలను తయారు చేశామని, వాటిని సురక్షితంగా సముద్రంలోకి నాలుగు సార్లుగా వదలిపెట్టినట్లు ఆయన అన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాల సమన్వయ కర్త శవనం చంద్రారెడ్డి, సముద్ర తాబేళ్ల సంరక్షణ దళం సభ్యులు కారాని శ్రీను, వాటుపల్లి సుబ్బారావు పాల్గొన్నారు.