మదనపల్లె టౌన్ : కట్టుకున్న భార్య నమ్మక ద్రోహం చేసి మరొకడితో లేచిపోవడం జీర్ణించుకోలేక, తన ఎడమ కాలును కొడవలితో రెండుగా తెగ నరికేసుకుని చనిపోవాలి అనుకున్నాడు. కలకలం రేపే ఈ ఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. ఇందుకు సంబంధించి బాధితుని సోదరి దేవి, తాలూకా పోలీసులు తెలిపిన వివరాలు..
కర్ణాటక రాష్ట్రం, చింతామణి తాలూకా నారాయణహల్లికి చెందిన ఎన్.వెంకటేశప్ప కుమారుడు శ్రీరాములు(35) శ్రీనివాసపురం జేవీ కాలనీకి చెందిన పవిత్రను 15 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. భవన కార్మికుడిగా పనిచేస్తూ సజావుగా సాగుతున్న వారి కాపురంలో భార్య వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. తమ 14 ఏళ్ల కుమార్తె, 10 ఏళ్ల వయసున్న కొడుకు కోసమైనా తీరు మార్చుకోవాలని భర్త భార్యను పలు మార్లు మందలించి హెచ్చరించాడు. అయినా పవిత్రలో కాస్తంత కూడా మార్చు రాలేదు. భర్తను మోసం చేయడమే కాకుండా నెల రోజుల క్రితం ఏకంగా అదే ఊరికి చెందిన తన ప్రియుడు సిద్దప్పతో లేచి పోయింది. తనను వదిలేసి మరొకడితో వెళ్లి పోవడంతో శ్రీరాములు భవన నిర్మాణం పనికి వెళ్లడం మానేసి ఇంట్లోనే తన పిల్లలకు అన్నీ తానై సమర్యలు చేస్తూ మానసికంగా కుంగిపోయాడు. ఉన్న ఊర్లో తలెత్తుకు తిరగలేక పోయాడు. తీవ్ర అవమానంగా భావించి, తన ఇద్దరు బిడ్డలను వెంట తీసుకుని ఐదు రోజుల క్రితం మదనపల్లె బసినికొండ వడ్డిపల్లెలో ఉన్న తన తోబుట్టువు దేవి ఇంటికి వచ్చాడు. చెల్లీ తన బిడ్డలను నువ్వే చూసుకోవాలని పదేపదే చెబుతూ వచ్చాడు. ఆవేదనలో శ్రీరాములు తనతో ఇలా అంటున్నాడులే అనుకుని దేవి ఆ విషయాన్ని సీరియస్గా తీసు కోలేదు. ఆదివారం ఇంట్లో బావ, తోబుట్టవు తన పిల్లలతో ఆడుకుంటూ ఉండగా.. చెల్లి ఇంట్లో ఉన్న ఓ కొడవలి తీసుకుని సమీపంలోని మాదిని కొండ అడవిలోకి వెళ్లాడు. అక్కడ చనిపోవాలని నిర్ణయించు కున్నాడు. వెంట తెచ్చుకున్న కత్తితో కాలును రెండుగా తెగ నరికేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. మద్యం మత్తులో ఉన్న కారణంగా కొంత సేపు నొప్పిని భరించి, ఆ తరువాత కేకలు పెట్టడంతో స్థానికులు గమనించి బాధితున్ని బైకులో స్థానిక జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్స అనంతరం రుయాకు రెఫర్ చేశారు. కుటుంబీకులు బాధితున్ని తిరుపతికి తీసుకెళ్లారు. శ్రీరాములు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విచారణ చేపట్టినట్లు తాలూకా పోలీసులు తెలిపారు.
కాలును రెండుగా తెగ నరుక్కున్న భర్త


